హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి 5 వరకు తెలంగాణలో పర్యటించనున్నది. మూడు రోజుల పర్యటనలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించనున్నది.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 33 జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవోలు), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నది. ఈ మేరకు ఈసీఐ బృందం పర్యటన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రానికి వచ్చే 15 మంది అధికారుల బృందానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ నేతృత్వం వహిస్తారు. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలిస్తారు.