హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టు లు, మే 25 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో లింక్ బయట పడుతున్నది. కమిషన్ మాజీ ఉద్యోగి సురేశ్తో సంబంధం ఉన్న మరో ముగ్గురిని గురువారం సిట్ అరెస్ట్టు చేసింది. సురేశ్ లింక్లతో 14 మందికి సంబంధమున్నట్టు సిట్ అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేసింది. బంధు త్వం, స్నేహంతో ఒకరికి పేపర్ ఇస్తే, వారి నుంచి మరొకరికి డబ్బులు ఇస్తూ ప్రశ్నపత్రాలు చేతులు మారాయని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో సురేశ్ గతంలోనే అరెస్టు కాగా, ఇతడి ద్వారా పేపర్ పొందిన ఆరుగురు తాజాగా అరెస్టయ్యారు. ఇందులో పూల రవికిశోర్, అన్నా చెల్లెలు రాయపురం విక్రమ్, దివ్య బుధవారం అరెస్టయ్యారు. రవికిశోర్ నుంచి రూ.3 లక్షల ఒప్పందంతో లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఏఈ ప్రశ్నపత్రాన్ని పొందిన భరత్నాయక్, వరంగల్కు చెందిన పసికాంతి రోహిత్కుమార్, గాడె సాయి మధును గురువారం సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో అన్న విక్రమ్, చెల్లె దివ్యతోపాటు పూల రవికిశోర్ను జువెనైల్ కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురికి జూన్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ జీ రాధిక ఆదేశాలు జారీ చేశారు.
సిట్ విచారణలో రోజుకో కొత్త పేరు బయటకు వస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే 43 మంది నిందితులు కాగా, 42 మందిని సిట్ అరెస్టు చేసింది. ప్రశ్నపత్రం చైన్ సిస్టమ్లో, లింక్లను గుర్తించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, డీఏవో, టౌన్ప్లానింగ్ పరీక్షలు రాసిన వారు, రాయాల్సిన వారి జాబితాతో తనిఖీ చేస్తూ సిట్ ఒక్కొక్క విషయాన్ని బయటకు లాగుతూ వెళ్తున్నది.