హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం మొదటిరోజు ఎస్సై, ఏఎస్సై మెయిన్ పరీక్షలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్థమెటిక్/టెస్టాఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ పేపర్లకు పరీక్షలు జరగ్గా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దృష్ట్యా పరీక్షల నిర్వహణకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ఠ చర్యలు తీసుకొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే, పరీక్ష హాల్లోకి పంపించారు. ఇన్విజిలేటర్ సహా తనిఖీ అధికారులను కూడా సెల్ఫోన్లతో అనుమతించలేదు. హైదరాబాద్ పరిధిలోని 34 పరీక్షా కేంద్రాల్లో మొ త్తం 19,973 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఆయా కమిషనరేట్లకు చెందిన కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆదివారం జరిగే జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు కూడా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.