హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడటంతో కేంద్రం చూపు తెలంగాణపై పడింది. అవసరమైన బియ్యాన్ని సరఫరా కోసం తెలంగాణపై ఆధారపడుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బియ్యం నిల్వలను వా యువేగంతో తరలిస్తున్నది. ఇక్కడ మిల్లర్లు ఇచ్చే బియ్యంను ఎప్పటికప్పుడు ఇతర రా ష్ర్టాలకు పంపిణీ చేస్తూ అవసరాలను తీరుస్తున్నది. రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం నిల్వల్లో తగ్గుదలే ఇందుకు సాక్ష్యం. గతంలో నిండుకుండలా కనిపించిన గోదాములు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఏడాదిలోనే ఎఫ్సీఐ బియ్యం నిల్వలు సుమారు 10 లక్షల టన్నులు తగ్గడం గమనార్హం. గతేడాది ఏప్రిల్ నాటికి వివిధ గోదాముల్లో కలిపి మొత్తంగా 12 లక్షల టన్నుల బియ్యం నిల్వ చేసింది. అది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెండు లక్షల టన్నులకు పడిపోయింది.
దేశవ్యాప్తంగా కూడా నిరుటి వానకాలం, ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు భారీ గా తగ్గింది. ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ రెండు సీజన్లలోనూ వరి సాగు పెరగడం గమనార్హం. దీంతో అనివార్యంగానే ధాన్యం ఉత్పత్తిపై ఈ ప్రభావం పడనున్నది. దీనికి తోడు కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని డిసెంబర్ వరకు పొడిగించింది. ఫలితంగా బియ్యం అవసరం భారీగా పెరిగింది. ఓవైపు బియ్యం డిమాండ్ పెరగడం మరోవైపు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఉత్పత్తి పడిపోవడంతో తెలంగాణ రాష్ట్రమే దిక్కుగా మారింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
సరిగ్గా ఏడాది క్రితం జరిగిన విషయం ఇది. పౌరసరఫరాల శాఖ, మిల్లర్లు సీఎంఆర్ (బియ్యం) ఇస్తామంటే తీసుకునేందుకు ఎఫ్సీఐ నిరాకరించింది. గోదాములు ఖాళీ లేవంటూ, రైల్వే ర్యాక్లు లేవంటూ, దేశంలో నిల్వలు అధికంగా ఉన్నాయంటూ, బియ్యంలో నాణ్యత లేదంటూ.. ఇలా సవాలక్ష సాకులు చెప్తూ బియ్యం తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో గోదాముల ముందు బియ్యం లోడ్ లారీలు రోజుల తరబడి నిలిచిపోయిన పరిస్థితులున్నాయి. కానీ ఇప్పుడు అదే ఎఫ్సీఐ, ఎప్పుడెప్పుడు బియ్యం ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నది. ఇచ్చిన బియ్యం ఇచ్చినట్టుగా తరలించేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా రైల్వే ర్యాక్లను కేటాయిస్తున్నట్టు తెలిసింది. దూర ప్రాంతాల్లో బియ్యం నిల్వ ఉంచితే తరలించేందుకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో రైల్వే లైన్లకు దగ్గరగా ఉండే గోదాముల్లో నిల్వ చేస్తున్నట్టు తెలిసింది.