హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేతరంగం, కార్మికుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించాలని, 5% జీఎస్టీ పరిహారం చెల్లించాలని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలన్న డిమాండ్తో అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమం శుక్రవారం నాటికి రెండేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా జీరో జీఎస్టీ ఉద్యమ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన చేనేత బీమా, త్రిఫ్ట్, బతుకమ్మ చీరలు తదితర పథకాలన్నింటినీ కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్గాంధీని కలిసి మద్దతు కోరగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5% జీఎస్టీ పన్నును పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని చెల్లించి మాట నిలుపుకోవాలని కోరారు. చేనేత రంగానికి రాబోయే బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనిల్, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడురు ప్రవీణ్కుమార్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ జెల్లా మారండేయులు, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వనం విశ్వనాథం, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతుల, ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి నక వేణుమాధవ్, కార్యాలయ కార్యదర్శి తిలక్, యువజన నాయకులు జెల్ల నరేందర్ పాల్గొన్నారు.