హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది. జిల్లాకు 100 చొప్పున 33 జిల్లాల్లో 3,300 క్లబ్బులను అందుబాటులోకి తెచ్చింది. గతంలో వీటి సంఖ్య 2,500 పైగా ఉండగా, ఏటా ఈ క్లబ్బులను విద్యాశాఖ అధికారులు విస్తరిస్తున్నారు. సమాజంలోని పరిస్థితులు, భిన్న మనస్తత్వాల కారణంగా ఇప్పటికీ బాలికలు శారీరక వేధింపులు, అహింస, లైంగిక దాడులు, బాల్య వివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యలను పరిష్కరించడం అవసరం. అందుకు విద్యాశాఖ అధికారులు బడుల్లో ఈ క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్బుల ద్వారా బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, జీవన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, లింగసమానత్వం, బాలిలకపై హింసను.. బాల్యవివాహాలను అరికట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ క్లబ్బుల నిర్వహణ వ్యయం కింద విద్యాశాఖ రూ. 16.5 లక్షల నిధులను మంజూరు చేసింది.