హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతులనూ ఆన్లైన్లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. శనివారం డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పలు సూచనలు ఇచ్చారు. మల్టి జోన్ల వారీగా ఉండే ఈ పదోన్నతులు సీనియారిటీ, రోస్టర్ ప్రకారం ఉండేలా సాఫ్ట్వేర్ను తయారు చేయిస్తున్నారు. రోస్టర్ను 1 నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
బీఈడీ అర్హతతో ఎస్జీటీగా నియమితులైన ఉపాధ్యాయులకు డీఈడీ అర్హత గల వారితో సమానంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టుకు పదోన్నతి కల్పిస్తారు. ఇటీవలే ఎన్సీటీఈ ఎస్జీటీ పోస్టుల నియామకానికి డీఎడ్ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఇది కేవలం నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని, పదోన్నతులకు వర్తించదని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీఈడీ అభ్యర్థులకూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తారు. బదిలీ దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. దీంతో బదిలీ పాయింట్లతోపాటు, ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల సీనియారిటీ జాబితాలను అధికారులు విడుదల చేశారు.