నాడు ఎట్లుండె తెలంగాణ. నిండిన చెరువులు.. పచ్చారబోసినట్టుండె పంటలు.. రైతన్నల సంతోషాలు.. మొత్తంగా పచ్చందాలతో పకపకా నవ్వినట్టుండె. నిరుడు ఇదే నెలలో చెరువులన్నీ నిండుగర్భిణిని తలపించేవి. నీటి గలగలలతో మత్తళ్లు పరవళ్లు తొక్కేవి. నిండు యాసంగిలోనూ నవ్వుతూ కనిపించేవి. అంతలోనే ఎంతమార్పు! సూరీడు ఇంకా మండనే లేదు. చెరువులు వట్టిపోయాయి. ప్రాజెక్టుల నీళ్లురాక నెర్రెలుబారుతున్నాయి. కాలువలు బోసిపోయినయ్. నెర్రెలిచ్చిన భూముల్లానే రైతన్న గుండెలు పగులుతున్నయ్. వేసిన బోర్లు వెక్కిరిస్తున్నయ్. చెరువులు ఎండి.. బోర్లు నీరు పొయ్యక అన్నదాత ఆగమైతుంటే, నీళ్లు అందక పంటలు నిలువునా ఎండుతున్నయ్. ముందుచూపులేని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నను నిలువునా కాల్చేస్తుంటే.. అన్నదాత కన్నీరు భూమిలో నిశ్శబ్దంగా ఇంకిపోతున్నది.
Congress | హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యాంలు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం నేడు బోరుమంటున్నాయి. దీంతో చెరువుల కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. చెరువులపై సర్కారు దృష్టి పెట్టకపోవడమే అందుకు ప్రధాన కారణం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చింది. వాటిని నింపడాన్ని తొలి ప్రాధాన్యంగా భావించేది. చెరువులకు శాశ్వత జలకళ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించింది.
కాళేశ్వరం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులతో ఇప్పటికే 10వేలకు పైగా చెరువులను ముడిపెట్టడంతోపాటు క్రమం తప్పకుండా నదీ జలాలతో నింపుతూ వచ్చింది. వానకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి క్రమం తప్పకుండా నింపుతూ వచ్చేది. వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వాటి పరిధుల్లోని చెరువులను ఏడాది పొడవునా నింపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ మూలమూల్లోని చెరువుల్లోకీ నదీ జలాలను తరలించారు.
ఏడాది పొడవునా చెరువుల్లో జలకళ ఉండేలా చూసి కరువన్నదే లేని తెలంగాణను గత బీఆర్ఎస్ సర్కారు ఆవిష్కరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చెరువులపై దృష్టి సారించలేదు. కృష్ణా బేసిన్లో నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో చెరువులు నింపలేని పరిస్థితి నెలకొన్నది. కనీసం గోదావరి బేసిన్లో నిన్నమొన్నటి వరకు చెరువులను నింపే అవకాశమున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఫలితంగా 2019 నుంచి వరుసగా చెరువులను నింపుతూ వచ్చిన కార్యక్రమానికి ఈ ఏడాది బ్రేక్ పడడంతో చెరువులన్నీ వేసవికి ముందే మళ్లీ బోసిపోతున్నాయి.
మొరాయిస్తున్న బోర్లు
నిరుడు మండుటెండల్లోనూ నీళ్లతో కళకళలాడిన చెరువులు నేడు నీళ్లు లేక ఎండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 43,870 చెరువుల్లో జలాలన్నీ అడుగంటినట్టు అధికారులు చెప్తున్నారు. గోదావరి బేసిన్లో 50 శాతానికి పైగా చెరువుల్లో నీటి నిల్వలు సగానికిపైగా పడిపోయాయి. కృష్ణాబేసిన్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. చెరువుల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వాటికిందనున్న బోర్లు సైతం మొరాయిస్తున్నాయి.
గతంలో చెరువులు జలకళతో తొణికిసలాడడం వల్ల రెండు పంటలకు పూర్తి భరోసా లభించింది. ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలోని 46,571 చెరువుల కింద 25,92,437 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో 2008-09 నుంచి ఏడాదికి సరాసరి 5-6 లక్షల ఎకరాలకు మించి సాగుకాని దుస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ పథకం అనంతరం చెరువుల్లో 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీనివల్ల 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. చెరువులను ప్రాజెక్టులకు లింక్ చేయడం వల్ల యాసంగి సాగులోనూ ఆయకట్టుకు పూర్తి భరోసా లభించింది.
2014-15లో చెరువుల కింద వానకాలం, యాసంగి పంటల సాగు విస్తీర్ణం 6,95,575 కాగా, నిరుడు దాదాపు 18లక్షల ఎకరాలకుపైగా సాగవడం విశేషం. ప్రాజెక్టులతో అనుసంధానించి చెరువులను నింపడం ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు యాసంగిలో నీటి భరోసా లభించింది. ఈ ఏడాది చెరువులను నింపకపోవడం మూలంగా ఆ మేరకు ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటిలానే ఈసారి కూడా చెరువులు నింపుతారన్న ఆశతో రైతులు అనేకచోట్ల యాసంగి సాగు చేపట్టారు. ప్రస్తుతం చెరువులన్నీ నీరులేక కళా విహీనంగా మారడంతో రైతాంగం ఆందోళనకు గురవుతున్నది. పంటలపై ఆశ వదులుకుంది. ఎండలు మరింత తీవ్రమైతే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి: జిల్లా అంటేనే పచ్చని తివాచీ పర్చినట్టుగా ఉండేది. సాగు పండుగలా సాగేది. నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగు నీటిని సరఫరా చేసే డీ-83, డీ-86 కాలువలు పెద్దపల్లి జిల్లా రైతాంగానికి జీవనాధారం. డీ-83 కాలువ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి మండలం రేవెళ్లి నుంచి ప్రారంభమై పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల గుండా 42 కిలో మీటర్లు ప్రవహించి అక్కడి నుంచి రైట్సైడ్ బ్రాంచ్ (ఆర్ఎస్బీ) కెనాల్గా రామగిరి, ముత్తారం, మంథని మండలాల మీదుగా 41కిలో మీటర్లు ప్రవహించి మంథని మండలం ఖానాపూర్ వద్ద వరకు చేరుతుంది. సుమారు 202 గ్రామాలకు సాగునీరు సరఫరా చేస్తుంది. ఈ డీ-83 కాలువ కింద సుమారు 65 మైనర్(ఉప) కాలువలు ఉండగా, మొత్తం 1.26 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నది.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లికి చెందిన ఈ రైతు పేరు దోర్నాల చిన్న రాజన్న. ఆయన తనకున్న నాలుగు ఎకరాల పొలంలో యాసంగిలో వరి పంట వేశాడు. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ఎత్తిపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. నెర్రెలు బారిన నేల తల్లిని చూసి చిన్న రాజన్న చిన్నబోయాడు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి నాట్లు వేశానని, మొత్తం ఎండిపోయిందని వాపోయాడు. మునుపు ఈ పరిస్థితి లేకుండేనని, ఇప్పుడు ఇట్లా ఎందుకైతుందో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నాడు. పంట ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టాల్లో ఉన్న రైతులకు కనీసం ధైర్యం చెప్పేవాళ్లు కూడా కరువయ్యారని కన్నీరు పెట్టుకున్నాడు.
కాటారం, ఫిబ్రవరి 24: విద్యుత్తు కాటుకు మరో రైతు బలయ్యాడు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. కాటారం ఎస్సై అభినవ్, గ్రామస్థుల కథనం ప్రకారం.. దామెరకుంట గ్రామ పంచాయతీ పరిధి లక్ష్మీపూర్కు చెందిన రైతు సంతోషం పెద్ద బాపు (64) మానేరు నది ఒడ్డున ఉన్న పొలంలో బోర్ మోటర్ సాయంతో ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేస్తున్నాడు. శనివారం దగ్గరి బంధువు పెండ్లి ఉండగా బాపు కుటుంబసభ్యులంతా వెళ్లారు. బాపు పొలం వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేయగా మోటర్ నడవలేదు. విద్యుత్తు తీగలను సరిచేస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. బాపు అచేతనంగా పడి ఉండటాన్ని కొంతసేపటి తరువాత పక్క పొలాలకు చెందిన రైతులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై-2 సురేశ్ తెలిపారు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా మూడు నెలల క్రితమే అనారోగ్యంతో చిన్న కొడుకు చనిపోయాడు.
కేసీఆర్ సర్కారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని సకాలంలో సమృద్ధిగా విడుదల చేయడంతో ఎలాంటి సమస్య రాలేదు. కానీ, ఈ సారి పరిస్థితి మారింది. డిసెంబర్ నుంచే ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా, ఈసారి జనవరి 15 నుంచి ఇస్తున్నారు. 15 రోజుల క్రితం కాలువ ద్వారా నీటిని విడుదల చేసినా అది కూడా గతం కంటే తక్కువగా ఇవ్వడంతో డీ-83 ప్రధాన కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీరు చేరలేదు. ప్రధానంగా మంథని, ముత్తారం మండలాల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు 20 రోజులుగా కాలువ నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపు 10వేలకు పైగా ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినే ముప్పు కనిపిస్తున్నది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు న్యావనంది లింబాద్రి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన ఈయన తనకున్న మూడెకరాల్లో వరి వేశాడు. అయితే, భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు ఎత్తిపోయింది. వరి పొట్ట పోసుకునే దశలో నీళ్లు లేక ఎండిపోతుంది. కండ్ల ముందే వాడిపోతున్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న లింబాద్రి భగీరథ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. నీళ్ల ట్యాంకర్కు అద్దెకు తీసుకుని రోజూ నాలుగు ట్యాంకర్ల నీటితో పొలాన్ని పారిస్తున్నాడు. ట్యాంకర్కు రోజుకు వెయ్యి రూపాయల అద్దె చెల్లిస్తున్నాడు. ఇంకా 15-20 రోజులు నీళ్లు అందిస్తే పంట చేతికొచ్చే అవకాశముంటదన్న ఆశతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నిస్తున్నాడు.
– సిరికొండ, ఫిబ్రవరి 24
పంటపొలంలో పశువుతో కనిపిస్తున్న ఈయన పేరు కొంకటి రవి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి. మూడునాలుగేండ్లసంది మంచిగ పంటలు తీసుకున్నడు. పోయినేడాది రెండెకరాల భూమి ఉన్నప్పటికీ ఒక్క ఎకరంలోనే వరి వేశాడు. నిరుడు రూ. 2లక్షలు వెచ్చించి బావి అడుగు తవ్వించాడు. పంట గట్టెక్కింది. అదే ఆశతో ఇప్పుడు కూడా ఎకరమే నాటేశాడు. తీరా బావి అడుగంటడంతో పంట మొత్తం పశువుల మేతకు వదిలేశాడు. ఇది రవి పరిస్థితి మాత్రమే కాదు. గ్రామానికి చెందిన ఎంతోమంది రైతులు బోర్లువేసినా చుక్క నీరు రాక పంటలపై ఆశలు వదిలేసుకుని పంటలను పశువులకు అప్పగిస్తున్నారు. మీదపడిన పెట్టుబడులు తీర్చుడెలానో తెలియక తల్లడిల్లుతున్నారు.
– కొంకటి రవి, రైతు, బొమ్మనపల్లి గ్రామం, చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా
కాలువ నీళ్లత్తయని ఆశపడి నాలుగెకరాలు నాటేసిన. మా గుజ్జులపల్లెకు ఒక దిక్కు నీళ్లత్తన్నయ్. ఇంకో దిక్కు అత్తలేవు. నా నాలుగెకరాలు మొత్తం ఎండిపోతాంది. నీళ్లియ్యిండ్రని నెల రోజుల సందిచ్చిండ్రు. శివుని గుడి కాన్నుంచెళ్లి కిందికి వత్తనే లేవు. మునుపు గిట్ల లేకుండె. నమ్మికంతోని నాట్లేసినం. నీళ్లచ్చినయ్. ఇప్పుడు ఎండి పోతన్నయ్. సార్లందరికీ దండం పెట్టి అడుగుతున్న నీళ్లియ్యిండ్రి.
– బొల్లెవేని రాజయ్య, రైతు, గుజ్జులపల్లె గ్రామం, సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా
వానకాలం సరైన వానల్లేక చెరువుల కోపుల్లోకి మాత్రమే నీరు వచ్చి చేరింది. సాగర్ ఎడమ కాల్వ రాకపోతుందా.. భారీ వర్షాలు పడకపోతాయా అన్న ధీమాతో యాసంగిలో బోరుబావుల కింద, చెరువు ఆయకట్టు కింద పొలాలు నాటు పెట్టాం. నాటిన సమయంలో భూగర్భజలాలు ఆశాజనకంగానే ఉండే. ఈ నెల ప్రారంభం నుంచి భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. మూడించులు నీరు పోసే బోర్లు ఇంచు, ఇంచున్నరకు మించడం లేదు. పొట్టకొచ్చిన పొలం నీరందక ఒక్కొక్క మడి ఎండి పోతున్నది. నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటే కరువు కాలం వచ్చిపడింది. అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక పోతున్నాం. కేసీఆర్ సీఎంగా ఉంటే ఈ దుస్థితి రానిచ్చేవాడు కాదు.
– పోలెపల్లి నారాయణరెడ్డి, రైతు, రాయినిపాలెం, నల్లగొండ జిల్లా
పాకాల చివరి ఆయకట్టులో పంటలకు నీరు సక్రమంగా అందడంలేదు. రైతులందరం రాత్రులు పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తున్నది. రాత్రంతా కష్టపడితే అర ఎకరం కూడా పారడంలేదు. ఒక్క పక్క పొలం పారితే మరోపక్క పొలం ఎండిపోతున్నది. కేసీఆర్ సారు ప్రభుత్వం ఉన్నప్పుడు యాసంగిలో ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నం. ఈ యాసంగిలో ధర్మరావుపేటలోనే 2 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేసుకోలేదు. మాకు పాకాల చెరువు నీళ్లే దిక్కు. పాకాల నీటిని పగటపూట కూడా వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి.
-పోతరాజు కరుణాకర్. రైతు, ధర్మారావుపేట, వరంగల్ జిల్లా
నెర్రెలిచ్చిన పంట మధ్యలో కూర్చున్న ఈ రైతు పేరు సింగిరెడ్డి సాయిరెడ్డి. సిద్దిపేట జిల్లాలోని రఘోత్తంపల్లి. తనకున్న నాలుగెకరాల్లో మూడెకరాలు మాత్రమే వరి పంట సాగుచేశాడు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో పంటకు సరిగా నీరందక పొలం నెర్రెలిచ్చింది. పంట ఎడిపోయింది. రైతుబంధు పైసలు రాకపోవడంతో బయట వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి పంట సాగుచేస్తే ఆశ లేకుండా పోయింది. నిరుడు యాసంగిలో నాలుగెకరాలు పొలం ఏస్తే మంచి దిగుబడి వచ్చింది. ఈసారి మాత్రం అంతా ఆగంగా ఉందంటూ బావురుమన్నాడు.
-సింగిరెడి సాయిరెడ్డి , రైతు, రఘోత్తంపల్లి (సిద్దిపేట జిల్లా)