మహబూబాబాద్ : దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ..వారి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అందులో భాగంగానే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, ఆర్డీవో కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.