హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్.. దీనిని అధిగమించేందుకు మరోసారి ప్రజలను హామీలతో ఏమార్చే ప్రయత్నం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందులో భాగంగానే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు తమ బాకా మీడియాలో పలు పథకాల అమలుపై లీకులిస్తూ మరింత మభ్యపెట్టేవిధంగా కథనాలు రాపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా ఓటర్లను మభ్యపెట్టి, మాయ చేసి మున్సిపల్ ఎన్నికల్లో గట్టేక్కే ప్రయత్నాలు చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా రైతులు, వృద్ధుల ఓటు బ్యాంకే టార్గెట్గా వారిని మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ తమ అనుకూల పచ్చ మీడియాను ఉపయోగించుకుంటున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోభాగంగానే కొన్ని టీవీలు, పేపర్లలో రైతుభరోసా, పింఛన్ల పెంపు అంటూ లీకు వార్తలు రాయిస్తున్నదని భావిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేఒక్కసారి అదీ గత వానకాలంలో మాత్రమే రైతులందరికీ రైతుభరోసా నిధులు జమ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఒకసారి గత ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచిన నిధులను జమ చేసింది. ఒకసారి పూర్తిగా ఎగనామం పెట్టగా, మరోసారి కొంతమంది రైతులకు మాత్రమే జమ చేసింది. ఈ యాసంగికి సంబంధించిన నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదు.
ఏ తేదీ నుంచి ఇస్తారనే విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. దీంతో సర్కార్ తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులను శాంతింపచేసేందుకు ఎన్నికలు పూర్తికాగానే రైతుభరోసా నిధులు జమ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ముక్తసరిగా, పొడిపొడి మాటలు చెప్పారు. దీనిని ఆసరాగా చేసుకొని పచ్చ మీడియా ఇక రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేసినట్టుగానే ప్రచారం చేస్తున్నది. రైతుభరోసా కోసం రూ.9 వేల కోట్లు రుణం తీసుకుంటున్నారని, ఎన్నికలు పూర్తికాగానే రైతుల ఖాతాల్లో వేసేస్తున్నారంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న రుణం రైతుభరోసా కోసమేనని పచ్చ మీడియాకు ఎవరు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు.
ఇక పింఛన్ల పెంపుపై వృద్ధులు సైతం గుర్రుగా ఉన్నారు. ప్రచారానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో అనుకూల మీడియాలో ఈ బడ్జెట్లో పింఛన్ల పెంపు కోసం సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నదంటూ మరో లీకు వార్తలు వచ్చేలా చేశారు. ఇక స్వయంగా సీఎం రేవంత్రెడ్డి అధికారిక సభలో ఎన్నికల ప్రలోభాలకు తెరలేపారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ పలు సభల్లో ప్రకటించారు. ఇలా సర్కార్పై వ్యతిరేకంగా ఉన్న, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం లీకు వార్తలను నమ్ముకోవడం గమనార్హం.