రామగిరి, నవంబర్ 6: ‘మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించిన తర్వాత ఆదివారం రాత్రి నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రం వద్ద అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ పతనానికి మునుగోడు నాంది అయిందని, టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ప్రజలందరూ ఆమోదిస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు.
మునుగోడులో బీజేపీ క్షుద్ర రాజకీయాలను ప్రజలు బండకేసి కొట్టారని, దీంతో కమలం పార్టీకి తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారన్నారు. డబ్బు అహంకారంతో విర్రవీగిన రాజగోపాల్రెడ్డిని ఇంటికి పంపిన మునుగోడు ప్రజల చైత్యనం ఎంతో గొప్పదని కొనియాడారు. టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన, సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజలకు, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల విజయం సాధించడంతో నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రం వద్ద నార్కట్పల్లి-నల్లగొండ ప్రధాన రహదారిపై పార్టీశ్రేణులు, అభిమానులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గులాబీ కార్యకర్తలు, అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. మంత్రి జగదీశ్రెడ్డిని గజమాలతో సత్కరించారు.