హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ):రాష్ట్రాలు ఆర్థిక క్షీణత పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితిని రాష్ర్టాలు ఇప్పటికైనా చక్కదిద్దుకోకపోతే శ్రీలంక లాంటి పరిస్థితులు ఏర్పడుతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉన్నదని తెలిపింది. ఈ రాష్ర్టాలు జీఎస్డీపీలో నిష్పత్తి పరిమితికి మంచి అప్పులు చేసినట్టు పేర్కొన్నది. ఈ జాబితాలో తెలంగాణ లేకపోవడం విశేషం. తెలంగాణ అప్పుల పాలైందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఆర్బీఐ నివేదిక తేటతెల్లం చేసింది.
రాష్ర్టాల అర్థిక పరిస్థితి క్షీణతకు సొంత పన్నుల ఆదాయం (ఓన్ టాక్స్ రెవెన్యూ) కంటే అధికంగా ఉచిత పథకాలు, సబ్సిడీలకు ఖర్చు చేయడమే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఆర్థిక స్థితిని చక్కదిద్దుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేయకుంటే మున్ముందు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదిక ప్రకారం రాష్ట్రాలు రెవెన్యూ వ్యయంలో సబ్సిడీలపై చేసే ఖర్చు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో 12.9, 11.2 శాతం ఉన్నట్టు పేర్కొన్నది. ఇది 2019-20లో 7.8- 8.2 శాతం మధ్యలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్లో అత్యధికంగా సబ్సిడీ, ఉచిత పథకాల వ్యయం రెవెన్యూ రాబడి కంటే 10 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ (14.1 శాతం), మధ్యప్రదేశ్ (10.8 శాతం), పంజాబ్ (17.8 శాతం) రెవెన్యూ రాబడి కంటే అధికంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించింది. గుజరాత్, ఛత్తీస్గఢ్ కూడా తమ రెవెన్యూ రాబడి కంటే 10 శాతం అధికంగా ఖర్చు చేస్తునట్టు గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఆర్థిక పరిస్థితి మరి ఘోరంగా ఉన్నదని, ఇప్పటికే ఈ రెండు రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు వివరించింది.