BJP | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తున్నది. శనివారం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్లా అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. హైదరాబాద్ టికెట్ను మాధవీలతకు కేటాయించడంపై ఎంతో మంది బీజేపీ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో సభ్యత్వమే లేని వ్యక్తికి పార్టీ టికెట్ను ఎలా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి హైదరాబాద్ టికెట్ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆశిస్తున్నట్టు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతున్నది. రాష్ట్ర రాజకీయాల్లో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న రాజాసింగ్.. ఎంపీగా పోటీచేసి ఢిల్లీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా తొలుత జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నించగా.. బీబీపాటిల్ టచ్లో ఉండటంతో అధిష్ఠానం సమాధానం ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ నుంచి అయినా పోటీ చేయాలని రాజాసింగ్ భావించినట్టు తెలుస్తున్నది. కానీ, ఆ టికెట్ మాధవీలతకు దక్కడంతో రాజాసింగ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు స్థానిక నాయకులు చెప్తున్నారు. ‘హైదరాబాద్లో నిలబెట్టేందుకు మగాడే దొరకలేదా?’ అని ఆయన బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వినికిడి.
జహీరాబాద్ టిక్కెట్ను బీబీపాటిల్కు ఇవ్వవద్దని బీజేపీ నాయకులు, కార్యకర్తలు చాలా రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఆ టికెట్ కోసం మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్రెడ్డి, అలె నరేంద్ర కుమారుడు భాస్కర్ పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకున్న బీబీపాటిల్కు మరుసటి రోజే ఆ టికెట్ను కేటాయించడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో బీజేపీలో చేరిన ఎంపీ రాములు నాగర్కర్నూల్ టికెట్ను తన కుమారుడికి ఇప్పించుకోవడంతో ఆ సీటును ఆశించి భంగపడిన బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి సీఎం రేవంత్రెడ్డి కలిశారు. భువనగిరి టికెట్ బూర నర్సయ్యగౌడ్కే దక్కుతుందని చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతుండటంతో ఆ సీటు కోసం ఇతర నేతలు ప్రయత్నాలు చేయలేదు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్ స్థానాలపై బీజేపీ ఆశలు పెట్టుకోకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించే నేతల కోసం ఎదురుచూస్తున్నది. అందుకే అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదనే ప్రచారం ఉన్నది. మిగిలిన మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్ టికెట్లపై బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతున్నది. మహబూబ్నగర్ టికెట్ను డీకే అరుణ, జితేందర్రెడ్డి ఆశిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీకే అరుణ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. జితేందర్రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. జితేందర్రెడ్డి ఎంపీ టికెట్ అడగకపోతేనే ఆయన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని అప్పట్లో అమిత్ షా షరతు విధించారనే ప్రచారం ఉన్నది.
కానీ, ఇప్పుడు తాను కూడా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతానంటూ జితేందర్రెడ్డి బీజేపీ అధిష్ఠానానికి సంకేతాలు ఇస్తుండటంతో మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావుతోపాటు అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బీజేపీని వీడుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదని తెలుస్తున్నది. ప్రధాని మోదీ ఆదిలాబాద్లో జరుపనున్న పర్యటన సందర్భంగా ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనున్నట్టు సమాచారం. మొత్తంగా బీజేపీలో టికెట్ల పంచాయితీ రానురాను మరింత రచ్చకెక్కుతుండటంతో ఆ పార్టీ నేత లు ఆందోళన చెందుతున్నారు.
బీజేపీలో మల్కాజిగిరి ఎంపీ సీటును ఆశించిన నేతల జాబితా కూడా చాలా పెద్దదే. వారిలో మల్క కొమురయ్య లాంటి కొందరు నేతలు ఇప్పటికే ప్రచారానికి రూ.కోట్లు ఖర్చు పెట్టగా.. సీనియర్ నేత మురళీధర్రావు లాంటి మరికొందరు నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. వారితోపాటు వీరేందర్గౌడ్, సురేశ్రెడ్డి, పన్నాల హరీశ్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సామ రంగారెడ్డి తదితరులు కూడా మల్కాజిగిరి టికెట్ కోసం పోటీపడ్డారు. కానీ, ఈ టికెట్ను ఈటల రాజేందర్కు ప్రకటించడంతో మిగతా నేతలంతా అలిగారు. దీంతో వీరంతా త్వరలో బీజేపీని వీడుతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారానికి మురళీధర్రావు తన ట్వీట్తో మరింత బలాన్ని చేకూర్చారు. ఇతర నాయకులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.