హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బదిలీలు, పదోన్నతల ప్రక్రియను ఆపొద్దని పీఆర్టీయూ తెలంగాణ నేతలు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియను ఆపేందుకు కొందరు కోర్టుల్లో కేసులు వేయడం సరికాదని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, సుంకరి భిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి హితవు పలికారు.
కొందరు తమకు అనుకున్న స్థానం దొరకలేదన్న కారణంతో స్వార్థపూరితంగా కేసులు వేశారని తెలిపారు. పదోన్నతులు నిలిచేందుకు కారకులైన వారిని ఉపాధ్యాయ లోకం క్షమించదని హెచ్చరించారు. బదిలీలు, పదోన్నతల ప్రక్రియను ఆటంకపర్చడంపై యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావ రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.