Kondagattu Anjanna | చిన్నకోడూరు, మే 1: తనను కన్న కొడుకు సరిగా చూసుకోవడం లేదని ఓ తండ్రి మనస్తాపం చెందాడు. ఈ మేరకు తన యావదాస్తిని కొండగట్టు అంజన్న ఆలయానికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం కొండగట్టు ఆలయానికి వెళ్లి ఆస్తికి సంబంధించిన పత్రాలను హుండీలో వేయడానికి ప్రయత్నిస్తుండగా పూజారులు గమనించారు. అలా వేస్తే చెల్లదని పూజారులు చెప్పడంతో బాపురెడ్డి వెనక్కి తగ్గాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కప్పెర బాపురెడ్డికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ప్రవీణ్రెడ్డి ఉన్నారు. అందరికీ వివాహాలు జరిపించాడు.
ప్రవీణ్రెడ్డి భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. బాపురెడ్డి భార్య లక్ష్మి సొంతూరులో ఉంటున్నది. కొన్నేండ్ల నుంచి బాపురెడ్డి హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో తనను ఎవరూ సరిగా చూడటం లేదని ఇటీవల గ్రామానికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తన ఆస్తిని కొండగట్టు అంజన్న ఆలయం పేరిట పట్టా చేయిస్తానని పట్టా పత్రాలతో బుధవారం కొండగట్టు దేవస్థానానికి వెళ్లాడు. బుధవారం సెలవు రోజు కావడంతో రిజిస్ట్రేషన్ కోసం బాపురెడ్డి అక్కడే అలయం వద్ద ఉన్నాడు. తన ఆస్తిని ఆలయం పేరిట పట్టా చేయిస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను కోరాడు.