Telangana | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ‘సన్నరకం వడ్లు సాగుచేయండి’ అని కేసీఆర్ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. అంతే.. అప్పట్లో కాంగ్రెస్ అనుకూల మీడియా తీవ్ర వ్యతిరేక వార్తలు గుప్పించింది. సన్నరకం సాగుతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగిందని, దిగుబడి తగ్గిందని, నష్టం కలుగుతుందంటూ మొసలి కన్నీరు కార్చింది. ‘సన్నరకం వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తాం’ అని రేవంత్ ప్రభుత్వం ప్రకటించగానే.. ‘సన్నాలకు ఊతం’ అంటూ అదే చానల్, పత్రిక సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల మీడియా రెండు నాల్కల ధోరణికి ఇదొక ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం 2020లో సన్నవడ్లను సాగుచేయాలని భావించి వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించి ంది. అవసరమైతే మద్దతు ధరకు రూ.100 బోనస్ ఇచ్చి అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతకు చెందిన ఓ పత్రిక, టీవీలో ‘రైతులకు మస్తు కష్టాలు’ అంటూ మొసలి కన్నీరు కార్చింది.
దొడ్డు వడ్లతో పోల్చితే ఎకరాకు రూ.10 వేల వరకు అదనంగా పెట్టుబడి అవుతున్నదని, 4-5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వస్తున్నదని, పంటకాలం నెల రోజులు ఎక్కువగా ఉన్నదంటూ వరుసగా కథనాలు రాసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తే.. అదే మీడియా ‘సన్నాలకు ఊతం’ అంటూ సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. బోనస్ ప్రకటనతో రైతులు సన్నాల సాగువైపు మొగ్గుచూపుతారంటూ వార్తలు వడ్డించింది.
చీడపీడలు, రూ.10వేలు అదనంగా పెట్టుబడి, తక్కువ దిగుబడి వంటి సాకులను పక్కన పడేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన మరో మీడియా సంస్థదీ ఇదే వ్యవహారం. కేసీఆర్ ప్రభుత్వం గతంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన సమయంలో వ్యతిరేక వార్తలను గుప్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేండ్లపాటు రియల్ ఎస్టేట్ రంగాన్ని, భూముల ధరలు విపరీతంగా పెరిగిన తర్వాతే కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించింది.
తర్వాత మరోసారి సవరణ చేపట్టింది. ఆ సమయంలో సదరు పత్రిక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని, క్రయవిక్రయాలు పడిపోతాయంటూ వరుసగా కథనాలు గుప్పించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
మరుసటి రోజే ఆ పత్రిక.. ధరల పెంపుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వస్తుందంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఒకప్పుడు క్రయవిక్రయాలు పడిపోతాయన్న చేతితోనే.. ఇప్పుడు రాష్ర్టానికి ఆదాయం పెరుగుతుందంటూ తిప్పిరాసింది. ఇలా అబద్ధపు రాతలతో ప్రజలను వంచిస్తూ, ఎలాంటి విలువలు పాటిస్తున్నట్టో ఆత్మపరిశీలన చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ అనుకూల మీడియా కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేసిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేసీఆర్ ఏం చేసినా తప్పు అని ప్రచారం చేసి.. ఇప్పుడు రేవంత్ ఏం చేసినా రైట్ అంటూ తలూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.