PM Modi | పెండ్లి అయిపోయిన ఆరునెలలకు బాజాలు మోగించినట్టుంది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు. ఐదేండ్ల క్రితం మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్ పనులు 2022 జూలైలో ప్రారంభమయ్యాయి. పిల్లర్ల దశకు చేరిన నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు భూమిపూజ చేసేందుకు ప్రధాని సిద్ధమయ్యారు. శనివారం మోదీ శంకుస్థాపన చేయనుండటం విస్మయపరుస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అయిపోయిన పెండ్లికి బ్యాండ్ వాయించిన చందంగా.. దాదాపు ఐదేండ్ల క్రితం 2018 డిసెంబర్లో మంజూరైన కాలేజీకి.. 2022 జూలైలో నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. ప్రధాని మోదీ ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తారట. ‘ఉన్నది చెంచెడు.. చెప్పేది చెంబెడు’.. సామెత కూడా ఎయిమ్స్కు అచ్చంగా సరిపోతుంది. తెలంగాణకు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంజూరు చేయగానే మెరుగైన వసతులతో, అద్భుతమైన వైద్యసేవలు అందుతాయని అటు ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రూ.వేల కోట్ల విలువైన 220 ఎకరాల భూమిని ఇచ్చింది. తాత్కాలిక వసతి కోసం రూ.100 కోట్లకుపైగా విలువైన భవనాలను అప్పగించింది. సుమారు నాలుగున్నరేండ్లు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెద్దాసుపత్రి కాస్తా.. పీహెచ్సీతో పోటీపడుతున్నది.
బీబీనగర్ ఎయిమ్స్కు 2018 డిసెంబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో అత్యాధునిక వసతులతో దవాఖానను నిర్మిస్తామని డబ్బా కొట్టుకున్నది. 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. మాటమీద నిలబడకుండా.. గడువును 2024 జూలైకి పొడిగించింది. కానీ.. 2022 జూలైలో టెండర్లు ఖరారుచేసి పనులు కట్టబెట్టింది. మళ్లీ నిర్మాణాల గడువును 36 నెలలుగా విధించింది. అంటే 2025 జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని చెప్పింది. పోనీ.. నిధులనైనా ఠంచనుగా విడుదల చేస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నదా? అంటే అదీ లేదు. అంచనా వేసిన విలువలో రూ.350 కోట్లు విడుదల చేసింది. అంటే.. మొత్తం కేవలం 25 శాతం. ఇక తొమ్మిది నెలల్లో పూర్తయిన పనులు కేవలం 5-7 శాతం మాత్రమే. ఏ ఒక్క భవనం కూడా ఒక్క అంతస్థు పూర్తి కాలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లోనే తాత్కాలికంగా కళాశాల, వైద్యశాల నడుస్తున్నాయి.
ఎయిమ్స్ను పేరుకే మంజూరు చేశాము తప్ప.. కనీస వసతుల కల్పనపై దృష్టిపెట్టడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గతంలో లోక్సభలో ఒప్పుకున్నది. బీబీనగర్ ఎయిమ్స్కు మొత్తం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి 1154 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 62 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది. అంటే ప్రతి ఐదు పోస్టుల్లో మూడు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. టీచింగ్ స్టాఫ్లో 45 శాతం, నాన్ టీచింగ్ స్టాఫ్లో 65 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న భవనంలో సరైన ఆపరేషన్ థియేటర్, అవసరమైన పరికరాలు లేవు. దీంతో ఎయిమ్స్ ఓపీకే పరిమితం అయ్యింది. బీబీనగర్లోని ఓ కంపెనీ ఇచ్చిన నిధులతో రెండేండ్ల కిందట ఆపరేషన్ థియేటర్, ఐసీయూలో కొంతమేర వసతులు కల్పించారు. దీంతో పీహెచ్సీలో మాదిరిగా.. చిన్నచిన్న సర్జరీలు చేయగలుగుతున్నారు. ఎయిమ్స్లో వసతులు లేవని అర్థం కావడంతో గర్భిణులు అక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
బీబీనగర్ ఎయిమ్స్లో 2019-20 నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభం అయ్యింది. తరగతులు నిర్వహించేందుకు అనువైన వసతులు లేకున్నా.. ఎంబీబీఎస్ బ్యాచ్ మొదలు పెట్టింది. ప్రస్తుతం మూడు బ్యాచ్ల విద్యార్థులు 260 మంది వరకు చదువుతున్నారు. ఆపరేషన్ థియేటర్లు లేకపోవడం, ఇన్పేషంట్లు రాకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టీస్ ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వారికి భువనగిరిలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని రాజ్కోట్లో ఎయిమ్స్ నిర్మాణానికి 2019 జనవరి 10వ తేదీన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణ వ్యయం రూ.1195 కోట్లు. తెలంగాణ తర్వాత మంజూరైన ఈ ఎయిమ్స్కు కేంద్రం ఇప్పటివరకు రూ.622 కోట్లు మంజూరు చేసింది. అంటే 52 శాతం నిధులు ఇచ్చేసింది.