Pocharam Srinivas reddy | గజ్వేల్, ఏప్రిల్ 29: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన కాల్వలకు సీఎం కేసీఆర్ పేరు పెట్టాలని ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ శివారులో కామారెడ్డికి నీళ్లు విడుదల చేసే కెనాల్ను సందర్శించిన ఆయన.. పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. 47 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, నాయకులను చూశానని, పట్టుదలతో అనుకున్నది సాధించి ప్రజల అవసరాలను తీర్చిన ఒకే ఒక సీఎం కేసీఆర్ అని చెప్పారు.
కాళేశ్వరం భారీ సాగునీటి ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో 13 జిల్లాల్లోని 31 నియోజకవర్గాల్లో రెండు పంటలకు సాగునీరు అందడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఎకరాల్లో పంటలు పండుతాయని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి 6 వేల క్యూసెక్కుల నీళ్లు హల్దీ వాగు ద్వారా సింగూర్, నిజాంసాగర్కు చేరుతాయని, దీంతో కామారెడ్డి జిల్లాకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. కొండపోచమ్మ కాల్వకు కేసీఆర్-1, నిజాంసాగర్, హల్దీ, సింగూర్కు వెళ్లే కాల్వకు కేసీఆర్-2గా నామకరణం చేస్తే బాగుంటుందని స్పీకర్ కోరారు. 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్.. నిజాంసాగర్ కంటే మూడింతలు పెద్దదని చెప్పారు.
మిగతా ప్రాజెక్టుల్లో 150 నుంచి 200 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పారు. ఏడాదిపాటు వర్షాలు పడకున్నా.. మేడిగడ్డ నుంచి మొదలుకొని సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లిని కలుపుకొని నిజాంసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అనంతసాగర్, కొండపోచమ్మసాగర్లో నిల్వ ఉండే నీళ్లతో పంటలు పండించుకోవచ్చని పోచారం తెలిపారు. తెలంగాణ రాక ముందు గోదావరి నీళ్లు ఎన్ని ఉన్నయో, ఎక్కడ ఉన్నయో ఎవరికీ తెలియదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకొని.. ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 1600 నుంచి 1700 టీఎంసీల గోదావరి నీళ్లను సాగుకు వాడుకుంటున్నామని వివరించారు.
కాళేశ్వరం కింద ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని స్పీకర్ పోచారం కొనియాడారు. త్యాగం చేసిన రైతులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. కామారెడ్డి కెనాల్ పనులను కూడా త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కింది ప్రాంతాలకు నీళ్లు రాకుండా అడ్డుగా కట్టిన చెక్డ్యామ్లతో శ్రీరాంసాగర్కు వరదనీరు రావడం లేదని, తెలంగాణలో కట్టుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నేడు శ్రీరామ్సాగర్ను గోదావరి నీళ్లతో నింపుకుంటున్నామని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో ఎడారిగా ఉన్న భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. దీనిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు సీఎం కేసీఆర్పై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతారని, ఆయన నాయకత్వం కోసం యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ మురళీధర్, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, నర్సాపూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, హన్మంత్షిండే, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.