కట్టంగూర్, జూలై 30 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అందులో ఉన్న రూ.23 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామంలో ఎస్బీఐ పక్కనే ఉన్న గదిలో ఒకటి ఔట్సోర్సింగ్ ఏటీఎం, మరొకటి ఎస్బీఐ ఏటీఎం మెషిన్లు ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మారుతీ వ్యాన్లో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి ముందుగా సీసీ కెమెరాలో కనిపించకుండా వాటిపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు.
అనంతరం ఏటీఎం గదిలోకి చొరబడి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఔట్సోర్సింగ్ ఏటీఎం మెషిన్ను కట్ చేసి అందులో ఉన్న రూ.23 లక్షల నగదు దోచుకెళ్లారు. పక్కనే ఉన్న మరో మెషిన్ను కట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఏటీఎంలో చోరీ జరిగినట్టు ఆదివారం ఉదయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్తో చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించి సీసీ ఫుటేజీ వీడియోలు, ఏటీఎం గదిలో ఆధారాలను సేకరించారు. దుండగుల చేతిలో ఇనుప రాడ్లు ఉన్నట్టు సీసీ ఫుటేజీలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు మేనేజర్ వీరబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.