కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12 తులాల 38 గ్రాముల బంగారం, 5కిలోల వెండి, రూ.8500నగదు, బుల్లెట్ వాహన స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలానికి చెందిన బండి నిలేష్, దుల రాజేశం, దుల నవీన్ వీరు ముగ్గురు మిత్రులు. గత కొన్ని నెలల నుంచి పలు బంగాం, కిరాణం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం వాంకిడి ఎస్సై దీకొండ రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి లంజన్ వీరా చౌరస్తా సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఈ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని విచారించగా తమ నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. ముగ్గురు కలిసి రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇండ్లు, షాపులే లక్ష్యంగా చోరీలకు పాల్పడేవారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, పండుగ వేళలో ఇంటి యజమానులు ఎవరైనా ఊరికి వెళ్తే..స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, ప్రతి దుకాణదారులు, ఇంటి యజమానులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలనీ ఎస్పీ సురేష్ కుమార్ ప్రజలకు సూచించారు.