జిగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మక్కజొన్న పంటలకు మంచి డిమాండ్ ఏర్పడేలా చేసి, అన్నదాత బతుకులు బంగారు బాటపట్టించేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమపై కాంగ్రెస్ గాయిగాయి చేస్తున్నది. రూ.750 కోట్ల ప్లాంట్ను చూసి ఓర్వలేక దుర్మార్గపు రాజకీయానికి తెరలేపింది. అమాయక ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, దీక్షలతో అభివృద్ధికి అడ్డుపుల్ల వేస్తున్నది. కేవలం రైతు సంక్షేమం అనే అజెండాతో ఏర్పడిన పబ్లిక్ రంగ సంస్థ క్రిభ్కో, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఏర్పాటుకు మోకాలడ్డుతున్న కాంగ్రెస్పై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 1 (సమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో) ఆధ్వర్యంలో రూ.750 కోట్ల ప్రాథమిక అంచనాలతో రైస్బ్రాన్, ఇథనాల్ ఉత్పత్తి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ 2021 నవంబర్లోనే నిర్ణయించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఈ బహుళ ప్రయోజక ఫ్యాక్టరీకి రూ.750 కోట్లు కేటాయించారు. ఇథనాల్ పరిశ్రమ కోసం వెల్గటూర్ మండలంలోని స్తంభంపెల్లి గ్రామ శివారులో 1,090 సర్వే నెంబర్లోని 413 ఎకరాల ప్రభుత్వ భూమిలో వంద ఎకరాలు కేటాయించారు. 2021 డిసెంబర్ 28న క్రిభ్కో సంస్థ చైర్మన్ చందర్పాల్సింగ్, వైస్ చైర్మన్ సుశీల్ కుమార్ బృందం స్థలాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సన్నద్ధం చేసేందుకు 2002 జనవరి 4న రూ.13 కోట్లు మంజూరు చేశారు.
ఈ స్థల చదును కోసం టెండర్ ప్రక్రియ ఇటీవలే పూర్తి కాగా, సన్నద్ధత పనులను కొప్పుల ఈశ్వర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకొన్న ధర్మపురిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే వాతావరణం కలుషితం అవుతుందని స్తంభంపల్లి సమీపంలో ఉన్న పాషిగామ్ గ్రామానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టారు. వారితో కృత్రిమ నిరసన చేపట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకొనేందుకు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోగా, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరుల కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని అడ్డుకోవడంతోపాటు ప్రజల్లో అలజడి కలిగించేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఏడాదిన్నరగా పరిశ్రమ స్థాపనకు సంబంధించి ఒక్క ప్రకటన చేయని వారు ఇప్పుడు తీరా పనులు ప్రారంభించే సమయంలో ఇలా ప్రవర్తించడం రాజకీయ కుట్రగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఈ ఇథనాల్ పరిశ్రమ బీబీ 2 క్యాటగిరీ కింద గుర్తింపు పొందింది. భారత పారిశ్రామిక చట్టం ప్రకారం బీబీ 2 పరిశ్రమలన్నీ వాతావరణ కాలుష్యానికి అవకాశం లేని పరిశ్రమలు. ఈ పరిశ్రమలను స్థాపించేందుకు స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం లేదని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇక ఇథనాల్ పరిశ్రమను 15.56 హెక్టార్ల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమకు అనుబంధంగా 5.14 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయనున్నారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ కోసం దాదాపు రూ.ఐదు కోట్లు కేటాయించారు.
ఇథనాల్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలానికి ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు లేవు. ప్రతిపాదిత స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్, టైగర్/ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల కారిడార్లు మొదలైనవి లేవు. ఫ్యాకరీకి మేలు చేసే విధంగా ప్రతిపాదత స్థలానికి వాయువ్య దిశలో 14 కిలోమీటర్ల దూరంలో మద్దునూర్ రిజర్వు ఫారెస్ట్ ఉంది. ఆగ్నేయ దిశలో 3.7 కిలోమీటర్ల దూరంలో మునుల గుట్ట రిజర్వ్ ఫారెస్ట్, దక్షిణ దిశలో 6.5 కిలో మీటర్ల దూరంలో కొండాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి.
గోదావరి నది ఈశాన్యం వైపు 1.9 కిలో మీటర్ల దూరంలో శ్రీరాంసాగర్ కాలువ, ఉత్తరం వైపు 100 మీటర్ల పెద్ద చెరువు, పశ్చిమం వైపు 1.43 కిలో మీటర్ల దూరంలో పెద్దవాగు, ప్రాజెక్ట్ స్థలానికి దక్షిణం వైపు 2.31 కిలో మీటర్ల దూరంలో శ్రీరాంసాగర్ కెనాల్ ఉండగా, దీనికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్వోసీ ఇచ్చింది. ఉత్తరం వైపు 100 మీటర్ల దూరంలో నీటి పారుదల శాఖ అండ్ సీఏడీ, ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి. పరిశ్రమ నుంచి వెలువడే వాయివులు, ఉద్గారాలు..ఏఏక్యూ పద్ధతిలో అధ్యయనం చేసిన తదుపరి ప్రతిపాదిత ప్రాజెక్ట్ తర్వాత గరిష్ఠ పెరుగుదల జీఎల్. సీఎస్ 0.29 ఫర్ గ్రామ్ ఉంటుందని ధ్రువీకరించారు. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు నిర్ధారించారు. అలాగే, ఉద్గారాలకు సంబంధించిన వాయి కాలుష్యం, ప్రమాదకరమైన వాయవుల సాంద్రత నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (ఎన్ఏఏక్యూఎస్) నిబంధనలకు లోబడే ఉన్నాయి.. నిరంతర ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్ స్టాక్తో పరిశ్రమ ఇన్స్టాల్ చేయబడుతుంది.
క్రిభ్కో ప్రైవేట్ రంగ సంస్థ కాదు…ఇది పూర్తిగా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. దేశ వ్యాప్తంగా 9 వేల రైతు సహకార సంఘాలు ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నాయి. తెలంగాణ రైతు సహకార సంఘాలు సైతం క్రిభ్కోలో భాగస్వాములుగా ఉన్నాయి. క్రిభ్కో, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వెల్గటూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్నది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచే క్రిభ్కో.. నిబంధనలకు విరుద్ధంగా వాతావరణ కాలుషం అయ్యే పరిశ్రమను స్థాపిస్తున్నదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.