మంచిర్యాల, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. దవాఖానలో ప్రసవం సురక్షితంగా జరిగి గర్భం నుంచి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా బయటపడే వరకు నానా హైరానా పడిపోతాం. కానీ, మన పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఈ పరిస్థితి లేదు. అక్కడ ప్రభుత్వ దవాఖానలు అందుబాటులో లేక.. ఒకవేళ ఎక్కడో దూరంగా ఉన్నా వాటిలో సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఆడబిడ్డలు రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకొంటున్నారు. గత ఐదేండ్లలో ఇలాంటివారి సంఖ్య పదుల నుంచి వేలలోకి పెరిగింది.
ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏటా వెయ్యిమందికిపైగా మహారాష్ట్ర వాసులు పురుడుపోసుకుంటున్నట్టు ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఈ జిల్లాల్లో జరుగుతున్న మొత్తం ప్రసవాల్లో 20% మహారాష్ట్ర వాసులవేనని వెల్లడైంది. వీటిలో క్రిటికల్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో దవాఖానలు ఎంతో మెరుగుపడ్డాయని, మంచి వైద్యులతోపాటు అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయని ఆ మహిళలు అంటున్నారు. ముఖ్యంగా బాలింతలకు ఇస్తున్న కేసీఆర్ కిట్టు ఎంతో బాగున్నదని, తెలంగాణలోని అన్ని రంగాల్లో అద్భుత పాలన కనిపిస్తున్నదని ప్రశంసిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో పుట్టినప్పటికీ తమ ప్రసవ వేదన తీరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్తున్నారు.
డాక్టర్లు మంచిగ చూసుకున్నరు..
నా పేరు కుర్సెంగ సునంద. మాది మహారాష్ట్రలోని అమ్డెల్లీ. రెండేండ్ల కింద పెండ్లయ్యింది. మొదటి సారి గర్భందాల్చిన. మొన్ననే ఏడు నెలలు పడ్డయి. రాత్రి విపరీతమైన నొప్పి రావడంతో 90 కి.మీ. ప్రయాణించి అర్ధరాత్రి 12.30 గంటలకు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నం. డాక్టర్లు మంచిగ చూసుకున్నరు. వచ్చిన కొంతసేపటికే స్కానింగ్ చేసిన్రు. కడుపులో బిడ్డ బాగానే ఉన్నా తల ఇంకా గట్టిపడలేదని చెప్పిన్రు. మందులతో సమస్య తగ్గుతుందన్నరు. మాది నిరుపేద కుటుంబం. మా దవాఖానతో పోలిస్తే ఇక్కడ మంచి వసతులున్నయి.
హైరిస్క్ కేసులే అధికం
ప్రసవాల కోసం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు వస్తున్న వారిలో హైరిస్క్ కేసులే ఎక్కువ. ఆదిలాబాద్కు 60 కి.మీ. దూరం లోపు ఉన్నవారే ఎక్కువగా ఇక్కడి వస్తున్నారు. వారు మహారాష్ట్రలో మంచి దవాఖానకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
– జైసింగ్ రాథోడ్,ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్
మా దగ్గరైతే నా బిడ్డ బతికేతి కాదు..
మాది సిరొంచ. నా పేరు సీహెచ్ సరిత. గత నెల 18న మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చేరడంతో పరిస్థితి సీరియస్గా ఉన్నదని చెప్పి ఆపరేషన్ చేసిన్రు. మా దగ్గరైతే నా బిడ్డ బతికేతి కాదు. ఇక్కడి డాక్టర్లు చాలా బాగా చూసుకొన్నరు. ఇంటికి వెళ్లేటప్పుడు కేసీఆర్ కిట్టు ఇచ్చిండ్రు. అందులో పిల్లలకు అవసరమైన అన్ని వస్తువులు ఉన్నయ్. మా దగ్గర దవాఖానలో వైద్యం చేసుడే ఎక్కువ. కానీ, ఇక్కడ వైద్యం చేయడంతోపాటు వెళ్లేటప్పుడు పిల్లల వస్తువులు ఇస్తున్నరు. ఎంత మంచి మనసుంటే ఇట్లా చేయాలే.