లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో పనిచేసే టీచర్లే వారి పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరుస్తున్న కాలమిది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజంటు ఒకటి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దటంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నది. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే రావటం మొదలైంది.
కొత్త విద్యా సంవత్సరం సోమవారమే మొదలైంది. బండ్లు ఓడలైనట్టు సర్కారు బడుల ముందు అడ్మిషన్ల కోసం పేరెంట్స్ క్యూ కడుతున్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రెండోరోజే నో అడ్మిషన్స్ బోర్డు పెట్టేశారు. మన ఊరు మన బడి పేరుతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఇది మారుతున్న తెలంగాణ ముఖచిత్రానికి మచ్చుతునక. ఇది కేసీఆర్ పాలనకు కీర్తి పతాక. ఇది సర్కారు బడి సత్తాకు తిరుగులేని ప్రతీక.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్