Leopard | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీ కొట్టడం వల్ల, అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు, విద్యుత్తు వైర్ల వల్ల, స్థానికుల దుశ్చర్యల వల్ల చిరుతల సంఖ్య తగ్గుతున్నట్టు 2022 స్థితిగతుల నివేదికలో స్పష్టం చేసింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని, ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి 569కి పెరిగిందని తెలిపింది.
తెలంగాణలో చిరుతల సంఖ్య తగ్గడంపై రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారిని ప్రశ్నించగా.. ఎన్టీసీఏ నివేదికను, చిరుతల సంఖ్యను అంచనా వేసేందుకు అనుసరించిన పద్ధతిని లోతుగా పరిశీలించిన తర్వాతే వాస్తవ కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో గత కొంత కాలం నుంచి చిరుతల మరణాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిరుతలు (రంగారెడ్డి జిల్లాలో ఒకటి, నారాయణపేట జిల్లాలో మరొకటి) చనిపోయాయి. దీంతో రాష్ట్రంలో చిరుతల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరమున్నదని ఎన్టీసీఏ స్పష్టం చేసింది.