NMC | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకొనే విద్యార్థులకు నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. నెక్స్ పేరుతో నిర్వహించే ఈ పరీక్ష పాసైతేనే పీజీ చేయడానికి అర్హులు కానున్నారు. అంతేకాదు.. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగానే పీజీ సీట్లను కేటాయిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య చదివిన విద్యార్థులు దేశంలో వైద్యవృత్తిని ప్రాక్టీస్ చేయాలంటే ఈ ప్రవేశ పరీక్ష కచ్చితంగా రాయాల్సి ఉంటుంది.
ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ తరఫున కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం/చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నెక్స్ రాయడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్షలో రెండు దశలు ఉంటా యి. మొదటి దశలో థియరీ పరీక్ష, రెండో దశలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక అభ్యర్థి ఎంబీబీఎస్లో చేరినప్పటి నుంచి పదేండ్లలోపు ఎన్నిసార్లయినా స్టెప్-1, స్టెప్-2 పరీక్ష రాసుకోవచ్చు.