హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్ తుల్జాభవన్లో ఆయన అధ్యక్షతన శుక్రవారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. రైతు రుణమాఫీ నిర్ణయంపై సంఘం హర్షం వ్యక్తం చేసింది.
సీఎం కేసీఆర్ ఆయుష్మాన్భవా.. అని, ఆయన నిండునూరేండ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ అర్చకులు ఆశీర్వచనం చేయాలని వాసుదేవశర్మ కోరారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ నిరంతరం కోరుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శమని కొనియాడారు. రైతు బాగుంటేనే అన్నానికి కొదువ ఉండదని, పాలకులు బాగుంటేనే ప్రజలకు కష్టాలు ఉండవని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ శర్మ, గౌరవ సలహాదారు లక్ష్మీనర్స య్య శర్మ, కన్వీనర్ గోపీ కృష్ణమాచార్యులు, కోశాధికారి హరికిషన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.