పాల్వంచ, మార్చి 19: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ పదోతరగతి పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన తప్పిదం మంగళవారం వెలుగు చూసింది. ఓ తరగతి గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఇన్విజిలేటర్ మెయిన్ జవాబు పత్రం ఇవ్వకుండా కేవలం అడిషనల్ పత్రాలపైనే పరీక్ష రాయించారు. రూమ్ నంబర్ 9లో తెలుగు పరీక్ష రాస్తున్న 24 మంది విద్యార్థులకు ఇన్విజిలేటర్ సరోజిని అదనపు జవాబు పత్రాన్ని ఇచ్చారు.
మంగళవారం హిందీ పరీక్షకు ఇదే గదికి వచ్చిన ఇన్విజిలేటర్ మెయిన్ జవాబు పత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. దీంతో కంగుతిన్న విద్యార్థులు సోమవారం అదనపు జవాబు పత్రం ఇచ్చారని ఇన్విజిలేటర్కు తెలిపారు. ఇన్విజిలేటర్ వెంటనే డిపార్ట్మెంటల్ అధికారికి సమాచారం అందించారు. డీఈవో వెంకటేశ్వరచారి స్పందించి ఇన్విజిలేటర్ సరోజినితోపాటు డిపార్ట్మెంటల్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్నూ విధుల నుంచి తొలగించారు. దీనిపై ఎంఈవో శ్రీరామమూర్తిని వివరణ కోరగా.. పరీక్షా కేంద్రంలో తప్పిదం జరిగిన మాట వాస్తవమేనని, కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.