రెండు నెలలుగా రాష్ట్రంలో వానలు పడుతూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొద్దిరోజులు ఎన్నికలంటూ తిరిగారు. అప్పుడు కూడా రైతుల్ని పరామర్శించింది బీఆర్ఎస్ మాత్రమే. ఇప్పుడు ఎన్నికలైపోయినయ్. రైతు గోస మాత్రం తీరలేదు. రోడ్డెక్కని రోజు లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసిపోసి ఉన్నాయి. వానలకు తడవడం.. అయినంక ఆరబెట్టుకోవడం.. రైతులకు ఇదే తండ్లాట. తడిసిన ధాన్యంతో వారు ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. సమీక్షల్లేవు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఎక్కడున్నారో తెలియదు. వడ్ల కొనుగోళ్లపై బాధ్యత తీసుకునేవారు లేరు. కొంటామని భరోసా ఇచ్చేవాళ్లూ లేరు.
Paddy Procurement | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కల్లాల్లోనే రోజుల తరబడి ధాన్యం.. కాంటా వేసేటోడు.. లోడు ఎత్తేటోడు లేడు.. ఎక్కడైనా కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని మిల్లుకు పంపినోడు లేడు.. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీసినోడు లేడు.. అధికారులను ప్రశ్నించి, పరుగు పెట్టించాల్సిన మంత్రివర్యులు కూడా పత్తా లేరు. సమీక్ష పెట్టింది లేదు.. ఇదేమని అడిగిన దాఖలా లేదు. ఇదీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉదాసీనత. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో ఎక్కడికక్కడ ధాన్యం పోయింది. కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి రైతుల కళ్లల్లో ఏమీ చేయలేని ధైన్యం కనిపిస్తున్నది. బోనస్ సంగతేమో కానీ ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సకాలంలో కొనడంలేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 75.40 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం సేకరణ కోసం ఆర్భాటంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7,151 కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసింది. నెలన్నర గడుస్తున్నప్పటికీ కేంద్రాల్లో 2,241 చోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియనే ప్రారంభం కాలేదని తెలుస్తున్నది. ఇప్పటివరకు 27 లక్షల టన్నులు మా త్రమే.. అంటే దాదాపు సగానికి తక్కువనే కొనుగోలు చేశారని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. నిరుడు ఇదే సమయానికి దాదాపు కొనుగోళ్ల ప్రక్రియ మొత్తం పూర్తయింది. కానీ, ఇప్పుడు ధాన్యం కొనుగోలు, రవాణా ఇలా అడుగడుగునా ప్రభుత్వ నిర్ల క్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. ధాన్యం కొ నుగోళ్ల ప్రక్రియ రోజుల తరబడి కొనసాగుతుండటంతో రైతన్నలు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అనేక చోట్ల వర్షాలతో కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయితున్నది. ధాన్యాన్ని ఆరబెట్టడం, మళ్లీ తడిసిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేతృత్వంలోనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కొనుగోళ్లు మందకొడిగా సాగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పత్తా లేకుండా పోయారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిష్కార మార్గాలను సూచిస్తూ, అధికారులను ముందుకు నడిపిస్తూ, కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాల్సిన మంత్రి ఇప్పటివరకు ఒక్క సమీక్ష పెట్టిన దాఖలా లేకపోవడం గమనార్హం. సివిల్ సప్ల య్ కార్పొరేషన్ అప్పులపై గతంలో హడా వుడిగా సమీక్షలు పెట్టిన మంత్రి కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఒక్కసారి కూడా ఆ దిశగా చూసింది లేదు. వ్యవసాయశాఖ మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నా, సీఎం సైతం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో చర్చిస్తున్నా కూడా పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం ధాన్యం కొనుగోళ్ల ఊసెత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మంత్రి ఉన్నారా? లేరా? అన్న సందేహాలు వెలువడుతున్నాయి.