రాజన్న సిరిసిల్ల, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా, పెండింగ్ బకాయిలు రూ.200 కోట్లు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. కలెక్టర్ రావాలంటూ నినదించారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వాహనాలు నిలిచి పోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ నాయకులను విడుదల చేయాలంటూ నేతన్నలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొద్దిసేపటి తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచి పెట్టారు.