హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ దీనికోసం కేటాయించిన నిధులు రూ.15 వేల కోట్లకు చేరుకోవడం విశేషం. పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
తొలుత ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ యువతుల వివాహానికి ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆ తర్వాత బీసీలకు సైతం వర్తింపజేసింది. 2017లో ఆర్థిక సాయాన్ని రూ.51 వేల నుంచి 75,116కు పెంచింది. 2018 మార్చి 19 నుంచి ఆ మొత్తాన్ని రూ.1,00,116కు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. గత జనవరి వరకు మొత్తంగా 12 లక్షల 469 మంది ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందగా, దాదాపు రూ.10,410 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ భారీగా నిధులను కేటాయించింది. నిరుడు 2,750 కోట్లను కేటాయించగా, ఈ బడ్జెట్లో 3,210 కోట్లు అంటే 460 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం.