హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి తుది తీర్పు గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని ఆ పిటిషన్లో పేర్కొన్నది. టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్ సుమతి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 719 మంది అభ్యర్థులు ఒకే రకమైన మారులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసంపై టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8% మంది టాప్-500 మందిలో ఉన్నారనేందుకు ఆధారాలు లేవని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా, మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ త్వరలో విచారణ జరుపనున్నది.