Migrant Labourers | న్యూఢిల్లీ, జూలై 16 (నమస్తే తెలంగాణ): పల్లెలన్నీ పచ్చగుంటే.. వాళ్ల గుండెలు ఉప్పొంగుతున్నయ్. వాగులు, కాల్వలు నీళ్లతో కళకళలాడుతుంటే.. వాళ్ల కండ్లలో ఆనంద బాష్పాలు వస్తున్నయ్. పొలాలన్నీ ధాన్యపు గుట్టలైంతుంటే.. వాళ్లకు కడుపు నిండినంత ఆనందమైతున్నది. ఎక్కడో ఎందుకు.. ఇక్కడే దర్జాగా బతుకుదామని సొంతూళ్లకు తిరిగి వస్తున్నరు. సరిహద్దులు దాటి, కుటుంబాలను వదిలి వందల కిలోమీటర్ల పోయి కష్టాలు పడుతున్న వలస కుటుంబాలన్నీ స్వరాష్ట్ర బాట పడుతున్నయి. పొట్ట కూటికి బొంబాయి, దుబాయి, సూరత్ వెళ్లిన వాళ్లంతా పల్లెలకు దారి పడుతున్నరు. సూరత్లో ఉంటున్న మనవాళ్లు.. తెలంగాణ అభివృద్ధిని చూసి సంబురపడుతున్నరు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని మస్తు అభివృద్ధి జేసిండని, సంక్షేమ పథకాలతో సుభిక్షంగా మార్చిండని ముచ్చటించుకుంటున్నరు. ఇక్కడి వాళ్లకు ఫోన్ చేసి.. సూరత్ కార్ఖానాల్లో బతుకీడుస్తున్నమని బాధపడుతున్నరు. గుజరాత్లో కార్మికుల గోసను పట్టించుకునేటోళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్లిన సీఎం కేసీఆర్.. సూరత్ వైపు కూడా చూస్తారని అక్కడి తెలంగాణ కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
పొలం చూసుకుంటూ హాయిగా ఉన్నం
నాకు 12 ఏండ్లప్పుడు ఊరి నుంచి చాలా మంది సూరత్కు పోయారు. మా మామయ్య కూడా పోయి అక్కడే పనిచేస్తుండేటోడు. ఆయనతోనే నేనూ పోయిన. డుంబాల్లో 30 ఏండ్లు ఉన్నా. నెల మొత్తం చేసినా ఆరేడు వేలే వచ్చేది. అది కూడా డబుల్ షిఫ్ట్ల పని. ఎప్పటికైనా సొంతూరు పోవాలని అనుకుని వచ్చేసిన. సీఎం కేసీఆర్ పుణ్యమా అని చెరువుల్లో నీళ్లు నిండుగా ఉంటున్నాయి. ఇప్పుడైతే రెండు పంటలు పండిస్తున్నాను. నాకు మూడు ఎకరాల వరి పొలం ఉన్నది. రైతు బంధు కూడా పడుతున్నది. సూరత్లో నాతో కలిసి పనిచేసిన చాలా మంది తిరిగివచ్చిండ్రు. సూరత్లోనే ఉన్న కొందరు ఇంకా ఇబ్బందులు పడుతున్నమని ఫోన్ చేసి చెప్తుంటరు.
– పాలబిందెల రాములు, రాజుల కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా
ఆనాడు ఉపాధి కరువై
ఉపాధి లేక లక్షల మంది పొట్టకూటి కోసం 1970ల్లోనే తెలంగాణ నుంచి దుబాయి, బొంబాయి, సూరత్కు వలస వెళ్లారు. ఇందులో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిరిసిల్ల ప్రాంతాల నుంచి దుబాయ్, బొంబాయికి వెళ్లగా, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి సూరత్ బాటపట్టారు. దాదాపు 6-7 లక్షల కుటుంబాలతో సూరత్లో తెలుగు కాలనీలు ఏర్పడ్డాయి. తిరిగొస్తున్న కుటుంబాలు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్మికులకు ఉపాధి వంటి కార్యక్రమాలతో.. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కుటుంబాలు సూరత్ను విడిచిపెట్టాయి. అక్కడి నుంచి హైదరాబాద్తోపాటు సొంతూళ్లకు తిరిగి చేరుకున్నాయి. హాయిగా తెలంగాణలోనే పనులు చేసుకుంటూ సంతోష జీవితాన్ని గడుపుతున్నాయి. సూరత్లో 2లక్షల కుటుంబాలు ఇంకా 2 లక్షల వరకు కుటుంబాలు ప్రస్తుతం సూరత్లోనే మగ్గిపోతున్నాయి. లింబాయత్, మిట్టిగాడి, అంజనా, ఓంనగర్, క్రాంతినగర్, ప్రతాప్నగర్ సహా పలు ప్రాంతాలలో తెలంగాణవాసులు నివసిస్తున్నారు. అక్కడి కార్ఖానాల్లో రోజూవారీ కార్మికులుగా పనిచేస్తున్నారు. అక్కడ కురవి, నెల్లికుదురు మండలంలోని చిన్నముప్పారం, రాజుల కొత్తపల్లి, కేసముద్రం, నర్సింహులపేట మండలం పెద్దముప్పారం, తుంగతుర్తి, మధిర నియోజకర్గాలు, కొడకండ్ల ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రాజుల కొత్తపల్లి నుంచే 500 కుటుంబాలు వలస వెళ్లాయి.
పట్టించుకోని గుజారాతీ సర్కారు
ఏండ్లుగా జీవనం సాగిస్తున్న వలస కార్మికులు, ఆయా కుటుంబాల అభివృద్ధికి గానీ, వారికి మౌలిక వసతులు కల్పన విషయంలోగానీ గుజరాత్ సర్కారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికలొచ్చినప్పుడే పార్టీలు పలకరించి వెళ్తాయని, ఆ తర్వాత చేనేత కార్మికులు, కుటుంబాల బాగోగుల గురించి ఎవరూ పట్టించుకోరని కార్మికులు బాధపడ్డారు.
గుజరాతీలు తెలంగాణ సర్కారును మెచ్చుకుంటున్నరు
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లిళ్లకు అందజేస్తున్న రూ.1,00,116 గురించి తెలిసిన గుజరాతీలు ఆశ్చర్యపోతున్నారని అక్కడ స్థిరపడ్డ మనవాళ్లు చెప్పారు. గుజరాత్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పెండ్లి ఖర్చుల కోసం రూ.10 వేలు మాత్రమే ఇస్తారని, అదికూడా ఎన్నో ఎంక్వైరీల తర్వాతేనని తెలిపారు. తెలంగాణలో ఇస్తున్న పింఛన్ల గురించి తెలిసి గుజరాతీలు మెచ్చుకుంటున్నారని వివరించారు.
కేంద్రం రద్దు చేసిన చేనేత పథకాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014 తర్వాత చేనేత పథకాలను రద్దు చేసింది. నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు, నేషనల్ టెక్స్టైల్ బోర్డు, నేషనల్ హస్తకళల బోర్డు, హోం ఫర్ వర్క్ షెడ్ మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఆర్ఆర్ఆర్ పథకం, మహాత్మాగాంధీ బున్కర్ బీమా యోజ న, నేషనల్ పవర్లూం బోర్డు, దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది నేషనల్ టెక్స్టైల్స్ పరిశోధన సంస్థలు, హంక్ యారాన్ (చిలుప నూలు)ను కేంద్రం రద్దు చేసింది. వీటన్నింటిని పునరుద్ధరిస్తే చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మేలు జరుగుతుందని చేనేత కుటుంబాలు వేడుకుంటున్నాయి. మోదీ ప్రధాని అయ్యాకే నూలు ధరలు పెరిగాయి దేశంలో నూలు ఉత్పత్తి చేసే స్పిన్నిం గ్ మిల్లులు 40 శాతం చేనేత అవసరాల కోసం సప్లయ్ చేసేవి. మోదీ ప్రధాని అయ్యాక 15 శాతానికి తగ్గించారు. దీంతో నూలు ధరలు పెరిగి ముడి సరుకులు అందుబాటులో లేకుండా పోయా యి. కేంద్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్న కస్టర్లను వెంటనే మంజూరు చేయాలి. ఇల్లు లేని చేనేత కార్మికులకు కేంద్రం ఇల్లు మంజూరు చేయాలి. 80 ఏండ్లు పైబడి చేనేత వృత్తి చేస్తూ మరణించిన కార్మికులకు మత్స్యకారులకు ఇచ్చినట్టే రూ.5 లక్షల బీమా వర్తింపజేయాలి.
-అవ్వారి భాస్కర్, చేనేత సహకార కార్మిక నేత, యాదాద్రి భువనగిరి