Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దున్నపోతుకు రేవంత్రెడ్డి ఫొటో అంటించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ యాదవుల వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో రేవంత్రెడ్డి ఎక్కడ పోటీచేసినా యాదవ, కురుమలు ఏకమై ఓడిస్తామని హెచ్చరించారు.
జేఏసీ నాయకులు గాంధీభవన్ను ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గొల్ల, కురుమల వృత్తితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను అవమానించిన రేవంత్రెడ్డి ఈ నెల 25లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గొల్ల, కురుమ సంఘాల జేఏసీ రేవంత్కు డెడ్లైన్ను విధించింది. రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడంతో జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రం నలుమూలల నుంచి గొల్ల, కురుమ లు ఇందిరాపార్క్ వద్దకు తరలివచ్చి, రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సంప్రదాయ డోలు చప్పుళ్లతో నిరసన తెలిపారు.
గొల్ల, కురుమల మనోభావాలను దెబ్బతీసేలా రేవంత్రెడ్డి మాట్లాడటం అగ్రకుల అహంకారానికి నిదర్శనమని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కుల, ఆర్థిక అహంకారంతో తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకుండా మొండిగా వ్యవహరించడం వల్లనే ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పూనుకున్నట్టు తెలిపారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీయే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో మొదటి నుంచీ కాంగ్రెస్ బీసీ, యాదవ వ్యతిరేక వైఖరితో ఉన్నదని విమర్శించారు. 2018లో జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొక్కుబడిగా ఒక్క ముషీరాబాద్ స్థానాన్ని మాత్రమే కేటాయించి యాదవులకు తీవ్ర అన్యాయం చేసిందని అసహనం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ యాదవుల అభ్యున్నతికి కృషిచేస్తుంటే కాంగ్రెస్ పాత వైఖరినే కొనసాగిస్తున్నదని ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పేవరకు ఆందోళనలను కొనసాగిస్తామని, రేవంత్ ఇంటిని, గాంధీభవన్ను ముట్టడించి నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ తన విధానాలను మార్చుకోని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్నాలో గొల్ల, కురుమ జేఏసీ నాయకులు డీ రాజారాంయాదవ్, కడారి అంజయ్యయాదవ్, గోసు ల శ్రీనివాస్యాదవ్, గోవర్ధన్యాదవ్, లాలూయాదవ్, గెల్లు శ్రీనివాస్యాదవ్, మేకల రాములుయాదవ్, శ్రీహరియాదవ్, బైకాని శ్రీనివాస్యాదవ్, మారం తిరుపతియాదవ్, సిద్దిరాజుయాదవ్, అయోధ్యయాదవ్, ఎక్కాల కన్నా కురుమ, పుష్పనగేశ్ కురుమ, సంపత్ కురు మ, శ్రీకాంత్యాదవ్, శ్రీశైలంయాదవ్, అశోక్యాదవ్, ఆశిష్యాదవ్, గడ్డం శ్రీనివాస్యాదవ్, అరు ణ్ కురుమ, రాంచందర్యాదవ్, సాగర్ కురుమ, పద్మయాదవ్, సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.