GST | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణ పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24వ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జీఎస్టీ వసూళ్లలో 55 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2019-20 మొదటి త్రైమాసికంలోని జీఎస్టీ రాబడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెల వరకు జీఎస్టీ రూ.5,092 కోట్లు ఎక్కువగా వచ్చింది. తెలంగాణ ఐదేండ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరును కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) మొదటి త్రైమాసిక ఆర్థిక నివేదికలో వెల్లడించింది.
అంచనాల్లో 23 శాతం రాక…
కేంద్రం జీఎస్టీని ప్రవేశ పెట్టినప్పటి నుంచి రాష్ట్రం ఏటికేడు వృద్ధిని సాధిస్తూనే ఉన్నది. 2019-20వ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో రూ.31,187 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేయగా, మొదటి మూడు నెలల్లోనే రూ. 6,326 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 20 శాతం. 2020-21లో బడ్జెట్లో రూ.32,671 కోట్లు వస్తాయని భావించగా.. జూన్ వరకు రూ.3,956 కోట్లు వచ్చాయి. 2021-22లో రూ.35,520 కోట్లు వస్తాయని ఆర్థికశాఖ ఆశించిగా మొదటి మూడు నెలల్లో రూ. 6641 కోట్లు సమకూరాయి. అయితే.. కరోనా, లాక్డౌన్ ఉన్న రెండేండ్లు జీఎస్టీ రాబడి కూడా కాస్త తగ్గింది. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితికి చేరింది.
2022-23వ ఆర్థిక సంవత్సరంలో రూ.42,189 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తాయని అంచనా వేయగా, జూన్ వరకు రూ. 9,645 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 23 శాతం. ఇక.. ఈ ఆర్థిక సంవత్సరం రూ.50,942 కోట్లు సమకూరుతాయని ఆశించగా, మొదటి త్రైమాసికంలో రూ.11,418 కోట్లు జీఎస్టీ రూపంలో ఖజానాకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 23 శాతం. ఇలా.. ఏటికేడు జీఎస్టీ వసూళ్లలో వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థికంగా మరింత బలమైన శక్తిగా రాష్ట్రం ఎదుగుతున్నది.