Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్లో వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది.
ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్లో 41.2, ఆదిలాబాద్లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5-8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తున్నది.
మండుటెండల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి టీఎస్ ఆర్టీసీ మజ్జిగ సరఫరా చేస్తున్నది. తీవ్ర ఎండలు, ట్రాఫిక్, ఇంజిన్ వేడి.. వంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని డిపోల్లో సల్ల అందించాలని నిర్ణయించింది.