హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డబ్బు పంపకాలపై దృష్టిపెట్టిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) అధికారులు శుక్రవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన సోదాల్లో సుమారు 160 మందికిపైగా అధికారులు పాల్గొన్నట్టు సమాచారం. ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయవాడలోని పలుచోట్ల 36 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని, సీఆర్పీఎఫ్ బలగాల రక్షణలో తరలించారు.
గురువారం నిర్వహించిన సోదాల్లో హైదరాబాద్లోని నివాసంలో పొంగులేటికి సంబంధించిన ‘పర్సనల్ రూమ్’ను గుర్తించిన ఐటీ అధికారులు.. దాని తాళం కోసం అడిగినట్టు తెలిసింది. అయితే, దానిని ఓపెన్ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో పాస్వర్డ్స్ కోసం అతని సతీమణి మాధురి, కొడుకు హర్షారెడ్డి, సోదరుడు ప్రసాద్రెడ్డిని ఖమ్మం నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు.
శుక్రవారం మధ్యాహ్నం వరకూ వారు పాస్వర్డ్స్ చెప్పకపోవడంతో ఐటీ అధికారులు కీ బ్రేకర్, ఫోరెన్సిక్ అధికారుల సాయంతో ఓపెన్ చేశారని తెలిసింది. కీ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు భారీగా నగదు లభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే నగదుకు సంబంధించిన స్టేట్మెంట్పై సంతకం చేసేందుకు పొంగులేటి నిరాకరించినట్టు తెలిసింది. పర్సనల్ రూంలో దొరికిన వివరాల ఆధారంగా శనివారం మరికొన్ని చోట్ల ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నది.
మీడియా ముందు పొంగులేటి చెబుతున్నట్టు తన సొమ్మంతా సక్రమమే అయితే.. పర్సనల్ రూమ్ కీ, పాస్వర్డ్స్ ఎందుకు చెప్పలేదు? తన వారితో ఎందుకు చెప్పించలేదు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు డబ్బు పంపకాల వ్యవహారంలో పొంగులేటి పర్సనల్ రూమ్ వ్యవహారం కీలకం కానున్నది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే, ఆ లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగాయి? ఎవరెవరి నుంచి చేతులు మారాయి? ఈ డబ్బుకు సూత్రధారిగా ఉన్నది ఎవరు? అనే విషయాలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్లో సుమారు పదిచోట్ల సోదాలు చేసిన అధికారులు, పర్సనల్ రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు, ఇతర ఆధారాలతో బంజారాహిల్స్లోని ‘రాఘవ ప్రైడ్’కు చేరుకొని విస్తృతంగా సోదాలు చేశారు. ఇక్కడి నుంచే పొంగులేటి ఎన్నో వ్యవహారాలను నడిపించినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది.
తన ఆస్తులు, కంపెనీలు, ఇండ్లు, వ్యాపారాలపై రెండ్రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులకు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయ రంగు పులిమారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తనపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయనే కనీస సోయి మరిచి.. బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు డబ్బులు విచ్చలవిడిగా పంచాలనే ఉద్దేశంతో పొంగులేటి ఉన్నట్టు కాంగ్రెస్కు చెందిన కొందరు బహిష్కృత నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే దీనిని పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టే ఆలోచన చేస్తున్నారు. గురువారం జరిగిన సోదాల్లో ఎన్నికల అధికారులు కూడా పాల్గొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, కొందరు కోవర్టుల ద్వారా ముందే మొత్తం సర్దేసిన పొంగులేటి.. మీడియా ముందు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల స్టంట్స్ వేయడంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ముదిరిపోయారని ఆ పార్టీ బహిష్కృత నేతలు చెప్తున్నారు.