High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం వెనుక ఎవరున్నారో తమకు తెలుసునని హైకోర్టు పేర్కొన్నది. ఏవో ఉద్దేశాలతో పిల్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమా..? ప్రచార వ్యాజ్యమా..? అని ప్రశ్నించింది. పిటిషనర్ తనకు తాను సీనియర్ అడ్వకేట్గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్ వెనుక ఉద్దేశాలు ఏమిటో, పిల్ దాఖలు వెనుక ఎవరున్నారో విచారణలో తేల్చుతామని వెల్లడించింది. పిల్ను సవరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని, హైపవర్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఎం విశ్వనాథరెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై హైకోర్ట్ సీజే జస్టిస్ అలోక్ అరాధే, జడ్జి జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు సర్టిఫై చేయకుండా పిటిషనర్ తనను తాను సీనియర్ న్యాయవాది గా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఇవన్నీ చూస్తుంటే ప్రాజెక్టుపై పిల్ దాఖలు వెనుక ఎవరున్నారో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జీ నందిత.. పిల్పై సత్వర విచారణ చేపట్టాలని కోరారు. వెంటనే స్పందించిన హైకోర్టు, ముందుగా సీనియర్ అడ్వకేట్గా పేరొనడాన్ని సవరించాలని పిటిషనర్ను ఆదేశించింది. పిల్ను ఏ పరిస్థితుల్లో దాఖలు చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని కూడా ఆదేశించింది.