హైదరాబాద్, అక్టోబర్ ౧౩, (నమస్తే తెలంగాణ): నాసిరకం విత్తనాల అమ్మకందార్లపై పోలీసులు ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను అమలుచేయడం సమర్థనీయమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నాసిరకం విత్తనాలను విక్రయించడం అంటే సమాజంలో అశాంతిని కలిగించడమేనని పేరొన్నది. నకిలీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుంటుంబాలు అనాథలయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. నష్టపోయిన రైతులు ఆగ్రహంతో బోగస్ విత్తన కంపెనీలపైనే కాకుండా వ్యవసాయాధికారులు, కార్యాలయాలపై దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఇలాంటి అశాంతికి దారితీసే నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీయాక్ట్ ప్రయోగించడం సబబేనని స్పష్టంచేసింది.
ఆక్రోశంతో రైతులు దాడులు చేయడం వల్ల సమాజానికి నష్టమని, ఇందుకు అసలు కారణం నాసిరకం విత్తన విక్రేతలని తీర్పు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. నాసిరకం విత్తనాలను విక్రయించే వ్యక్తిపై పీడీయాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేయడాన్ని సమర్థించింది. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాకు చెందిన గడ్డం రవీంద్రబాబు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నాడనే ఆరోపణపై పీడీయాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్ జూలై ౧౫న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సమర్థిస్తూ ప్రభుత్వం జీవో ౧౦౪౮ని జారీ చేసింది. చర్లపల్లి జైల్లో ఉన్న రవీంద్రబాబు విడుదల కోసం ఆయన సోదరుడు గడ్డం తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.