హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. జీవో -317లో భాగంగా ఇతర జిల్లాల టీచర్లు రంగారెడ్డికి బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాలోని టీచర్లకు సీనియారిటీ జాబితాల్లో అన్యాయం జరిగిందని పలువురు కోర్టునాశ్రయించారు.
దీంతో మల్టిజోన్ -2లో హెచ్ఎంల పదోన్నతులకు బ్రేక్పడింది. దీంతో బదిలీలు, మిగతా పదోన్నతులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కోర్టు స్టేను ఎత్తివేయడంతో పదోన్నతులకు అనుమతి లభించింది. మల్టీజోన్ -2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేయడం పట్ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పాత షెడ్యూల్ను కొనసాగించేందుకు కోర్టు తీర్పునివ్వడాన్ని ఆయనతో పాటు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి నవాత్ సురేశ్ స్వాగతించారు. హెచ్ఎంల పదోన్నతులను తక్షణమే చేపట్టాలని కోరుతూ సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు వినతిపత్రం అందజేశారు.