హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల బదిలీల వివాదంపై ఈ నెల 23 నుంచి తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలో దంపతులకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. భార్యాభర్తలైన ప్రభుత్వ ఉద్యోగులు ఒకచోట పనిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు.
ప్రభుత్వ అఫిడవిట్పై స్పందించేందుకు గడువు కావాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విన్నపంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరి నుంచి బదిలీలు నిలిచిపోయాయని, 60 వేల మందికిపైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు. కొంతమందికి పదోన్నతులు కూడా రావాల్సి వున్నదని తెలిపారు. దీనిపై రామచందర్రావు స్పందిస్తూ, భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై సత్వరం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కోరారు. పిటిషనర్లు పదేపదే వాయిదాలు కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తుది విచారణ 23న చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.