హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్రాకు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని చట్టవ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ నిజామాబాద్కు చెందిన జీ చందు హైకోర్టులో పిల్ వేశారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించి తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసిన డీఈసీ ఇన్ఫ్రా నిరుడు అక్టోబర్లోనే ప్రభుత్వానికి అప్పగించిందని, ఈ నేపథ్యంలో ఉత్తర్వుల జారీకి అవకాశం లేదంటూ పిల్ను కొట్టివేసింది. ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక పిల్ వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండ్ల నిర్మాణాన్ని ఓ సంస్థ పూర్తిచేయలేక మధ్యలోనే వదిలేస్తే మరో సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో వివక్ష ఏమీ లేదని స్పష్టం చేసింది. పిటిషనర్ చెబుతున్నట్టుగా రాజ్యాంగంలోని 14వ అధికరణకు ఇది విరుద్ధంగా ఏమీ లేదని పేర్కొన్న కోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది.