YS Sharmila | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ చెప్తున్నదే నిజమైంది. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ, షర్మిల గూడుపుఠాణి బట్టబయలైంది. ఇంతకాలం తెరవెనక సాగిన మంతనాలు.. లోపాయికారి ఒప్పందాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. తెలంగాణకు కేంద్రం వీసమెత్తు సాయం చేయకున్నా, నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కనాడు కూడా విమర్శించరు. బీజేపీ నేతలు సరేసరి. వీరి లక్ష్యం ఒక్కటే బీఆర్ఎస్. కేసీఆర్. పొద్దున లేచింది మొదలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనినీ విమర్శించడం, సంబంధమే లేని విషయాలను ఆపాదిస్తూ బురదజల్లడం, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు చేయడం. ఇదే వారి వ్యాపకం. దీంతో వారి ముగ్గురూ ఒక్కటేనన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో నెలకొన్నది. ఇంతకాలం తెరవెనక నుంచి పరస్పరం సహకరించుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆ మూడు పార్టీల అసలు బండారం వైఎస్ షర్మిల ఫోన్ కాల్తో బయటపడింది. అసలు విషయం ఏమంటే.. ఒకవైపు పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నది.
పేపర్ లీకేజీని ప్రభుత్వ పెద్దలకు ఆపాదిస్తూ ఆది నుంచీ ఆ మూడు పార్టీలు రాజకీయాలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ తమ తీరు మార్చుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ అంశంపైనే కలిసి పోరాడుదామంటూ షర్మిల ఫోన్ చేయడం, ఈ ప్రతిపాదనను బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు తిరస్కరించకుండా, వెంటనే ఒప్పుకోకుండా.. సానుకూలత వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది మూడు పార్టీల గూడుపుఠాణీకి అద్దం పడుతున్నది.
నిరుద్యోగుల విషయంలో కలసి పోరాడుదామంటూ, అందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామంటూ వైఎస్ షర్మిల స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి శనివారం ఫోన్ చేశారు. అయితే దానిని ఆ ఇరువురూ తిరస్కరించకపోవడం గమనార్హం. దీంతో ఆ మూడు పార్టీల అసలు రంగు తెలిసిపోతున్నదని బీఆర్ఎస్ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకాలం తెరవెనక సహకరించుకుంటూ, ఫోన్లు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేసిన వారు ఇప్పుడు బాహాటంగా మాట్లాడుకోవడంలో వింతేమీ లేదంటున్నారు.