హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రైతాంగం దిగాలుపడి దిక్కుతోచని స్థితిలో ఉంటే రాష్ట్ర సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులెవరూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీస ఓదార్పు హామీ ఇవ్వకపోగా మాట వరుసకు కూడా వారిని పట్టించుకోలేదని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారుకు రైతుల కన్నా పార్లమెంట్ ఎన్నికలే ముఖ్యం అయ్యాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ ఉదహరిస్తున్నది. సీఎంగా రేవంత్రెడ్డికి రైతుల దుర్భర పరిస్థితుల కన్నా ఢిల్లీ పెద్దలతో మంతనాలు, వారిని మచ్చిక చేసుకోవటమే ఎక్కువ అని మండిపడుతున్నది. డిసెంబర్ 7న రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 12 సార్లు ఢిల్లీలో పర్యటించారని గుర్తు చేస్తూ, ఎంపీ టికెట్లపై చర్చలకు ఆదివారం కూడా వెళ్తున్నారని చెప్తున్నది. రైతు హామీలను విస్మరించి సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ బాట పడుతుంటే, గుండె చెదిరిన రైతన్నకు బాసటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రైతుల పట్ల తమకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఇదేనని పేర్కొంటున్నారు.