Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధితో రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. స్వరాష్ట్రంలో భూ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర సొంత రాబడుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కీలకంగా మారింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటేటా భూ లావాదేవీలు, ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కనిపించింది. ప్రభుత్వం ఆశించిన మేరకు ఆదాయం వస్తున్నది. కొన్నిసార్లు అంచనాలకు మించి రాబడి నమోదైంది. కొవిడ్ సమయంలో కాస్త నెమ్మదించినా.. ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకున్నది.
రెండున్నర రెట్లు పెరిగిన లావాదేవీలు
2014-15తో పోల్చితే రాష్ట్రంలో భూ లావాదేవీలు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014-15లో 8.26 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. 2021-22లో ఏకంగా 19.88 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. 11.62 లక్షల లావాదేవీలు అధికంగా నమోదయ్యాయి. ఆదాయ వృద్ధిలో రికార్డుస్థాయి పురోగతి నమోదైంది. 2014-15లో రూ.2,707 కోట్ల ఆదాయం రాగా.. 2021-22 నాటికి రూ.12,364 కోట్లకు చేరింది. ఆదాయం ఏకంగా నాలుగున్నర రెట్లు పెరిగింది. కొవిడ్ విజృంభించిన 2020-21లో 12.11 లక్షల లావాదేవీలు జరుగగా రూ.5,260 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కానీ, ప్రభావం తగ్గగానే మరుసటి సంవత్సరం ఏకంగా రెట్టింపునకుపైగా ఆదాయం రావడం తెలంగాణపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తున్నది.
అంచనాలకు తగ్గట్టుగా రాబడి
రాష్ట్రంలో మొదటి నుంచీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి అంచనాలకు తగ్గట్టుగా వస్తున్నది. 2014-15లో అంచనాలకు మించి ఆదాయం నమోదైంది. ఎనిమిదేండ్లలో నాలుగుసార్లు అంచనాలకు మించి ఆదాయం రావడం విశేషం. 2017-18, 2018-19లో ఆశించిన ఆదాయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండున్నర నెలలు మిగిలి ఉండగానే 73% రాబడి వచ్చింది.
ప్రభుత్వ పాలసీలతో ‘రియల్’ పరుగులు
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నది. ఓవైపు ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్, తయారీ, ఫార్మా కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతుండటం, మరోవైపు ప్రాజెక్టులు పూర్తై సాగునీటికి కొదవ లేకపోవడంతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ద్వారా దేశంలోనే అత్యధిక ఆదాయం సమకూరుతున్న అగ్రగామి రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
– స్థిత ప్రజ్ఞ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు