Indiramma Indlu | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినా.. పట్టణ ప్రాంతాలకు ఎన్ని, గ్రామాల కోటా ఎంత? అర్హులు, అనర్హులు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే మార్గదర్శకాలపై కసరత్తు ప్రారంభమవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని గతంలో మాదిరిగా రాజకీయ అవసరాల కోసమే వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఆ జాబితాకు ఇన్చార్జి మంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని నిబంధన పెట్టనున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మళ్లీ దరఖాస్తులను పిలిచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లులేని పేదలకు ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల గ్యారెంటీలో ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం రాష్ట్రంలో 4.5లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత మార్చి 11న ప్రభుత్వం భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ.. ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ఈ పథకాన్ని పక్కకుపెట్టింది. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసిన నిబంధనల ప్రకారం సొంత జాగా ఉండి, గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇల్లు పొందనివారు, తెలుపు రేషన్ కార్డు కలిగివున్నవారితో జాబితాను రూపొందించి గ్రామసభల్లో అర్హులను ఎంపికచేయాలని నిర్ణయించారు. అయితే, పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నవారిలో చాలామందికి ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు తదితరులకు ఎంతమేరకు భాగస్వామ్యం కల్పించాలనేది కూడా ఇంకా నిర్ణయించాల్సివుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగిస్తే అసలు లక్ష్యం దెబ్బతింటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అనుచరులు, సన్నిహితులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఇలా సొంతవారికే కైంకర్యం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇలాగే జరిగే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో ఇంటికి దశలవారీగా రూ. 5లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇంటి కోసం ప్రజాపాలన సందర్భంగా 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ఇందులో అనర్హులను తొలగించి అర్హులతో జాబితా తయారుచేసిన తరువాత ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంటుంది. మరోవైపు, 4.5 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరమవుతాయి. కానీ బడ్జెట్లో రూ. 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. గృహనిర్మాణ శాఖ హడ్కోనుంచి రూ. మూడు వేల కోట్లు సేకరిస్తున్నది. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ. 1.5 లక్షల చొప్పున నిధులు అందే అవకాశముంది. అయినప్పటికీ మరో రూ. 5000 కోట్ల వరకూ లోటు ఏర్పడనుంది.
గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ నగరాలు, పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు వారు ఉన్నచోటే (ఇన్ సిటూ విధానం) గుడిసెలను తొలగించి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే, పూరి గుడిసెలు కూడా లేకుండా అద్దె ఇండ్లలో ఉండే పేదలకు ప్రభుత్వ ఖాళీ జాగాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి హౌసింగ్ స్కీమ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తున్నది. అయితే, పట్టణాల్లో ఇంటి స్థలం ఉన్నవారికి మాత్రం యాజమాన్య పత్రాలు సరిగా ఉంటే వారికి ఇల్లు మంజూరు చేసే యోచన ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ పథకం ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యనేతలు మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.