హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం 11 విడతలపాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రైతుబంధు సాయం అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క విడత అందించేందుకే ఆపసోపాలు పడుతున్నది. డిసెంబర్లో మొదలుపెట్టి నాలుగు నెలలు గడుస్తున్నా పంపిణీ ఇంకా సాగుతూనే ఉంది. ఐదెకరాల వరకు రైతుబంధు పంపిణీ పూర్తయినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రెండు, మూడు ఎకరాల రైతులకు కూడా ఇప్పటి వరకు రైతుబంధు అందలేదు. కొత్తగూడేనికి చెందిన మొడియం సీతారాములుకు ఉన్నది రెండెకరాలే అయినా ఇప్పటికీ రైతుబంధు పడలేదు. మూడున్నర ఎకరాల భూమి ఉన్న మిర్యాలగూడకు చెందిన పతంగి వెంకటేశ్వర్లుదీ అదే కథ. వీళ్లిద్దరే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం 64.75 లక్షలమంది (92.68శాతం) రైతులకు రైతుబంధు జమచేసినట్టు చెప్తున్నారు. గత వానకాలం సీజన్లో కేసీఆర్ సర్కారు 68.99 లక్షలమంది రైతులకు రూ. 7,625 కోట్లు ఖాతాల్లో జమచేసింది. అంటే మంత్రి చెప్పిన లెక్క ప్రకారం 64.75 లక్షల మంది పోగా ఇంకా 4.23 లక్షల మందికి మాత్రమే రైతుబంధు అందాల్సి ఉంది. గత వానకాలం లెక్కలనుబట్టి ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు సుమారు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ లెక్కన ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఐదెకరాల వరకు రైతుబంధు పంపిణీ పూర్తిచేసినప్పటికీ ఇంకా 6 లక్షల మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ మంత్రి తుమ్మల ప్రకటన ప్రకారం ఇంకా 4.23 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేయాలి. అంటే సుమారు 2 లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ అందుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న యాసంగి రైతుబంధు పంపిణీని సీఎం రేవంత్రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం కన్నా ముందే రైతుబంధు ఇస్తున్నట్టు గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటికీ పంపిణీ పూర్తికాలేదు.సాగుకు ముందు అందాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయం కోతలు పూర్తవుతున్నప్పటికీ అందకపోవడంతో పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో సమయానికి పెట్టుబడి అందేదని, ప్రస్తుత పరిస్థితులతో పాతరోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొంటున్నారు.
నాకు రెండెకరాల భూమి ఉంది. యాసంగి వరి సాగుచేశాను. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు బ్యాంక్లో పడలేదు. సరైన సమయంలో డబ్బులు పడకపోతే పంటలెలా పండిస్తం. పెట్టుబడికోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. రెండునెలల నుంచి ఎదురుచూస్తున్నా, ఇంతవరకు పడలే. కేసీఆర్ హయాంలో ఇలా ఎన్నడూ జరగలే.
– మొడియం సీతారాములు, దిబ్బగూడెం, కొత్తగూడెం జిల్లా
నాకు నాలుగెకరాల భూమి ఉంది. నిరుడు యాసంగిలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 20 వేలు నా బ్యాంకు ఖాతాలో వేసింది. ఇప్పుడు యాసంగి పంట చేతికొస్తున్నా ఇప్పటి వరకు రైతుబంధు సాయం అందలేదు. సాగు పెట్టుబడి కోసం ఉద్దెర మీద మందు బస్తాలు తెచ్చిన.
-పూదరి అంజన్న, నెన్నెల, మంచిర్యాల జిల్లా
నాకు ఐదెకరాల పొలముం ది. యాసంగిలో వరి సాగుచేస్తే నీళ్లు లేక సగం పంట ఎండిపోయింది. కొద్దిపాటి ధాన్యం చేతికందినా సరైన ధర రాలేదు. నాటు వేసే సమయంలో అందించాల్సిన రైతుబంధు సాయం పంట కోసినా పడలేదు. పంట ఎండి పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
-దేవులపల్లి సైదయ్యచారి, రాగడప, నల్లగొండ జిల్లా