హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది. ఈ నెల నుంచే డీడీఎన్ ఆలయాలకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున గౌరవ వేతనాలు ఇవ్వనున్నారు. ఇవికాకుండా 3,500 ఆలయాల్లో అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇస్తున్నారు. దీంతో 9,771ఆలయాలకు ప్రభుత్వ సహకారం ద్వారా ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అమలవుతున్నాయి. మరో 250 ఆలయాలకు త్వరలో ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు దేవాదాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం పొందితే రాష్ట్రంలోని మొత్తం ఎంపికచేసిన 11,000 పైచిలుకు ఆలయాలకు డీడీఎన్ పథకం వర్తించనున్నది. హైదరాబాద్ బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ డీడీఎన్ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.6000 నుంచి రూ.10,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,271 డీడీఎన్ ఆలయాలకు ఈ నెల నుంచే రూ.10 వేల చొప్పున వేతనం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఆలయాజేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో బుధవారం బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అర్చక సంఘాల నాయకులు మాట్లాడారు. కొత్తగా 350 ఆలయాలకు డీడీఎన్ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. డీడీఎన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా సుమారు 10 వేల ఆలయాల్లో ప్రభుత్వ సహకారంతో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. మిగతా ఆలయాలకూ త్వరలోనే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొండూరి కృష్ణమాచారి, జేఏసీ సభ్యులు మఠం శివకుమార్, భద్రినాథాచార్యులు, పరాశరం రవీంద్రాచారి, అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు.