హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్లో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లక్ష సాయం అమలు అంశాలపై మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్తోపాటు సంబంధిత అధికారులతో చర్చించారు.
ఇందులో బుధవారం నుంచే లబ్ధిదారులకు సాయం చెక్కుల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించాలని, విడతలవారీగా అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో మైనార్టీ సంక్షేమశాఖ సెక్రటరీ ఉమర్ జలీల్, గురుకుల సెక్రటరీ షఫి ఉల్లా, కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. కాగా, లక్ష సాయం పథకాన్ని బుధవారం నుంచే ప్రారంభించాలనే నిర్ణయంపై ఇంతియాజ్ ఇసాక్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.