ఒకప్పుడు చిరుజల్లులకే చెరువులకు గండ్లు పడేవి. గట్టివాన కొడితే కట్టలు తెగేవి. కేసీఆర్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. వందేండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం కురిసినా.. రాష్ట్రంలో చెరువు కట్టలు చెక్కు చెదరలేదు. తటాకాల పదిలం.. మిషన్ కాకతీయ ఫలం, ఫలితం.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చేస్తారనేది పెద్ద ప్రశ్న. పునరుద్ధరణ పనులకూ ఏండ్ల పాటు ప్రహసనం. ఇప్పుడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిషన్ కాకతీయ పథకానికి తోడు నీటిపారుదలశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగం కృషితో నేడు చెరువులన్నీ పదిలంగా ఉన్నాయి. కుండపోత వర్షాలు కురిసినా చెక్కుచెదరకుండా నిలిచి ఉంటున్నాయి. చిన్నచిన్న కుంటలు మినహా ప్రధాన చెరువులకు బుంగలు పడిన దాఖలాల్లేవు. ఎక్కడైనా చెరువు తెగితే అధికారులు 15 రోజుల్లోనే మరమ్మతులు పూర్తిచేస్తున్నారు.
మిషన్కాకతీయతో చెక్కుచెదరని చెరువులు..
ఉమ్మడి పాలనలో తెలంగాణలో ధ్వంసమైపోయిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు మిషన్ కాకతీయ పథకం ప్రారంభించి ఉద్యమం తరహాలో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులున్నట్టు గుర్తించారు. వాటిలో సుమారు 12,000 గొలుసుకట్టు చెరువులున్నాయి. మొత్తం జలాశయాల్లో చెరువులు 38,411 ఉండగా, మిగతావి చిన్న కుంటలు. మిషన్కాకతీయ పథకం తొలిదశలో 5 నుంచి 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఏటా 20 శాతం చొప్పున ఇప్పటివరకు నాలుగుదశల్లో రూ.9,155కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. కట్టల బలోపేతం, పూడికతీయడం, తూముల పునర్నిర్మాణం, అలుగుల మరమ్మతులు తదితర పనులు పూర్తి చేశారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల మట్టం కూడా ఎంతో పెరిగింది. చెరువుల కింద రెండు పంటలకు భరోసా లభించడంతోపాటు, మత్స్య, పాడిపరిశ్రమ.. ఇలా మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. మరోవైపు వరద నియంత్రణకు చెరువులు ఎంతగానో దోహదపడుతున్నాయి. చెరువులకు గండ్లు పడటం కూడా తగ్గిపోయింది.
కుండపోత వాన కురిసినా..
ఈ ఏడాది రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో కురవాల్సిన సగటుకు మించి 65 శాతం అధిక వర్షపాతం కేవలంలో 5 రోజుల్లో కురిసింది. వాగులు, వంకలు ఏకమై ప్రవహించాయి. అయినా 155 చోట్ల మాత్రమే చెరువులకు గండ్లు పడ్డాయి. అందులో చిన్నచిన్న కుంటలు మినహా పెద్ద చెరువులు ఏవీ లేవని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి సామర్థ్యానికి మించిన వరద ఒక్కసారిగా రావడం ఫలితంగానే ఆ కుంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల జనావాసాలు మునగకుండా కాపాడేందుకు అధికారులే కట్టలకు గండ్లు పెట్టారు. వీటిలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులు లేవని అధికారులు వెల్లడించారు.
ఓఅండ్ఎంతో సత్ఫలితాలు
గతంలో చిన్నచిన్న చెరువుల మరమ్మతులకు కూడా ఈఎన్సీ లేదంటే ప్రభుత్వం ద్వారా అనుమతులు పొందాల్సి ఉండేది. ఫలితంగా మరమ్మతులకు నోచుకోక ఉమ్మడి రాష్ట్రంలో అనేక చెరువులు మట్టికొట్టుకుపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇరిగేషన్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా ఈ శాఖ పరిధిలో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ను నియమించారు. ఫలితంగా చెరువుల పర్యవేక్షణ, మరమ్మతులకు క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండాపోయింది. ప్రాజెక్టులు, పంప్లు, కాల్వలు, చెరువులు, తూముల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఓఅండ్ఎంకు కట్టబెట్టారు. సీజన్ ప్రారంభంలోనే తూములు, షెట్టర్లు, ప్రాజెక్టుల గేట్లను చెక్ చేయడం, గ్రీసింగ్ తదితర చర్యలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సత్వర మరమ్మతుల కోసం డీఈ నుంచి సీఈ వరకు ఆర్థిక అధికారాలను కూడా కట్టబెట్టారు. డీఈ రూ.5 లక్షలు, ఈఈ రూ.25 లక్షలు, ఎస్ఈ రూ.55 లక్షలు, చీఫ్ ఇంజినీర్ రూ.కోటి వరకు సత్వర పనులకు కోసం వెచ్చించే అధికారాన్ని కట్టెబట్టారు. అంతుకు మించి నిధులను వెచ్చించాల్సి వచ్చినప్పుడే ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా దాదాపు రూ.280 కోట్ల వరకు ఓఅండ్ఎం పనులకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఫలితంగా చెరువులకు ఎక్కడయినా గండి పడినా వెంటనే ఇంజినీర్లు తమ ఆర్థిక అధికారాలను వినియోగించి మరమ్మతు పనులు సత్వరమే పూర్తి చేస్తున్నారు.
శరవేగంగా మరమ్మతులు
ఇటీవల కురిసిన కుంటపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 155 వరకు చిన్నచిన్న కుంటలకు గండ్లు పడ్డాయి. రెగ్యులర్ మానిటరింగ్, మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలోనే వరదలకు చెరువులు చెక్కుచెదరకుండా ఉంటున్నాయి. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న చెరువుల మరమ్మతులను కూడా చేపట్టాం. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల మరమ్మతు పనులకు అంతరాయం ఏర్పడుతున్నది. అయినప్పటికీ 15 రోజుల్లోనే గండ్లు పడిన కుంటలన్నింటినీ పునరుద్ధరిస్తాం. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.
– నాగేందర్రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఓఅండ్ఎం)