BJP | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలతో బీజేపీలో మొదలైన మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, క్యాడర్ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోతున్నారు. బండి సంజయ్కి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు నేతలు ఏకమయ్యారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా బీజేపీ వాట్సాప్గ్రూపుల్లో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది. అరవింద్ వ్యాఖ్యలు, ఆయనకు మద్దతుగా పేరాల చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఓ వర్గం వాదిస్తున్నది. దీనికి బండి సంజయ్ వర్గం కౌంటర్లు వేస్తున్నది. ముఖ్యంగా పేరాల చంద్రశేఖర్రావు చేసిన తీవ్ర వ్యాఖ్యలపైనా చర్చ జరుగుతున్నది. బండి సంజయ్ మాఫియా ైస్టెల్లో వ్యవహరిస్తున్నారని, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, ముందు నుంచి ఉన్న క్యాడర్ను కాకుండా ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని కొత్తగా వచ్చినవాళ్లకు పదవులు ఇస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇది క్రమంగా సంఘ్ వర్సెస్ బీజేపీగా మారుతున్నది. రెండు రోజులుగా బండి సంజయ్ వర్గం చంద్రశేఖర్పై (శేఖర్జీ)సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నది. ఇన్నేండ్లలో పార్టీకి, సంఘ్కు చేసిందేమీ లేదని, దమ్ముంటే రాజీనామా చేయాలని కామెంట్లు చేస్తున్నారు. దీంతో చంద్రశేఖర్కు మద్దతుగా మరోవర్గం పోస్టులు పెడుతున్నది. మూడు దశాబ్దాలకుపైగా ఫుల్ టైమర్గా, ప్రచారక్గా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారని ప్రచారం చేస్తే మరి సంఘ్ చేసిన వ్యక్తినిర్మాణం ఏమిటి? అని నిలదీస్తున్నారు. విషయాన్ని సంఘ్కు ముడిపెడుతున్నారు. పార్టీ వలసదారుల చేతుల్లోకి వెళ్తుంటే అడ్డుకోవడం తప్పు ఎలా అవుతుందని, అలాంటివారి నుంచి కాపాడుకోవటం పతనమా? చేతగాని తనమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి స్వయంసేవక్ చంద్రశేఖర్కు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు గతంలో ధర్మపురి అరవింద్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసి చిక్కుల్లో పడ్డప్పుడు బండి సంజయ్ ఆయనకు మద్దతుగా నిలిచి వెనుకేసుకొచ్చాడని, ఆ కృతజ్ఞత లేకుండా ఇప్పు డు విమర్శిస్తున్నాడని మండిపడుతున్నారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అభ్యర్థన మేరకు ఆయన ఈ నెల 18న తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ తమ ఎదుట ఈ నెల 15న హాజరుకావాలని తొలుత ఆదేశించింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను 18న హాజరవుతానని బండి సంజయ్ అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కమిషన్ శనివారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించింది. ఒకవేళ ఆరోజు హాజరుకాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.